శుష్క ప్రియాలు శూన్య హస్తాలు- 1
బడ్జెట్ పై పిట్ట కధ చెప్పమని జిలేబి గారి కోరిక,మొత్తం బడ్జెట్ మీద చెప్పలేను, నాకు ఇష్టమైన వ్యవసాయ రంగం మీద చెబుతున్నా. ఈ టపా జిలేబిగారికి అంకితం.
మా సత్తిబాబు ఈ వేళ తీరుబడిగా వచ్చి కూచుని “పంతులు గారూ శుష్కప్రియాలు,శూన్య హస్తాలు అంటే ఏమిటండీ” అన్నాడు. “సత్తి బాబూ! బాంబులాటి అనుమానాలు అడుగుతున్నావయ్యా, మొన్న చెప్పుకున్నాము కదా, సంజయ రాయబారం గురించి, అదే సమాధానం”
సంజయుడిని రాయబారం పంపుతూ ధృతరాష్ట్రుడు ఇలా చెప్పమంటాడు. “మీరు గొప్పవాళ్ళు, ధర్మాత్ములు, న్యాయం తెలిసిన వాళ్ళు, కష్టాలు పడ్డారు, యుద్ధం మంచిదికాదు, శాంతిగా ఉండండి,” ఇలా అన్నీ శుష్కమైన ప్రియాలు మాట్లాడతాడు కాని “అర్ధ రాజ్యం ఇస్తున్నాను, ఏలుకోండి’ అని మాత్రం అనడు. “దీనినే శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు అని అంటారు,”అన్నా. “సరేగానిండి మన బడ్జెట్ గురించి చెప్పినారు కాదు, ప్రణబ్ దాదా చెప్పినాడు కదా” అన్నాడు. “ఏమోనయ్యా! అందులో ఏదో ఏదో చెప్పేరు దాదా గారు కాని నాకు నచ్చినది ఒకటే సుమా” అన్నా. “ఏంటండి అది” అన్నాడు. “వ్యవసాయానికి ఆరు లక్షల కోట్ల పై చిలుకు సొమ్ము కేటాయించారు కదా అందుకు” అన్నా. మా సత్తి బాబు పడి పడి నవ్వేడు. “అదేంటయ్యా నవ్వుతావు ఆరు లక్షల కోట్లు వ్యవసాయానికి కేటాయిస్తే రైతు కెంత మేలు” అన్నా. మళ్ళీ నవ్వేడు, సత్తి బాబు. “నువ్వు అలా నవ్వితే ఎలాగ. ధర్మ సూక్ష్మం చెప్పు మరి రాజకీయం తెలియని వాడిని కదా” అన్నా. “అలా దారికి రండి చెబుతా వినండి” అని మొదలెట్టాడు.
పంతులుగారు ఎంతన్నారు, ఆరు లక్షల పై చిలుకు కోట్లు కదా. ఇదంతా మీ పల్లెటూళ్ళకి తెచ్చి వెంకట స్వామీ నీకు ముఫయి వేలు, నీపంట పోయినందుకు, సత్యవతీ, నీకు ఏభయి వేలు నీ పంట పూర్తిగ పోయినందుకు అని పంచి పెడతారనుకున్నారా. అదేంకాదు. వ్యవసాయం మీద రిసెర్చ్ చేసే సంస్థలకి, పి.హెడి. చేసేవారికి, సిబ్బంది జీతాలు, ఆ సంస్థలలో బల్లలు కుర్చీలు, ఏసీ లు వగైరా కొనడానికి మిగిలినది వ్యవసాయం మీద రిసెర్చ్ కి కర్చు పెడతారు. ఇంకా ఎరువుల ఫేక్టరీల వారికి ఎరువు తయారీ మీద అయిన ఖర్చుకు సబ్సిడీ ఇస్తారు. వారెవరు, వారు మాకు కావలసిన వారే. ఇంకా వ్యవసాయ పని ముట్లు యంత్రాలు తయారు చేసే కంపెనీలకి ప్రోత్సాహాలిస్తారు. వారూ మా వారే. ఇన్ని చేసినా ఆ కంపెనీలు ఎరువుల ధరలూ తగ్గించవు,వ్యవసాయ పని ముట్ల తయారీ దారులూ ధరలు తగ్గించరు. ఇంకా రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించడం కోసమని సేంద్రియ ఎరువులు తయారీ దారులను ప్రోత్సహించడానికి సబ్సిడీలిస్తారు. అంటే సేంద్రియ ఎరువులు తయారు చేసుకుంటున్నాను, షెడ్డు వేసుకుంటాను, దాని ఖరీదు రెండు లక్షలవుతుంది అని దరఖాస్తు పెట్టుకుంటే అందులో నాలుగిట మూడు వంతులు సబ్సిడీ ఇస్తామంటారు. మీరు చంకలెగరేసి వెళితే ఇవ్వరు. అది కావలసిన వారికి, పార్టీ వారికి ఇస్తారు. అప్పుడు కూడా వేసి ఉన్న షెడ్ ను కొత్తగా వేస్తున్నట్లు వగైరా తతంగం నడిపి డబ్బులు పంచుకుంటారు. అవన్నీ పెద్దలకే చేరతాయి. సామాన్య రయితు పంట పోయింది బాబో అని గోల పెడితే, అందరూ కలిసి మొన్న తొలకరిలో చేసినట్లు వ్యవసాయం చెయ్యమని క్రాప్ హాలీడే ప్రకటిస్తే శిస్తు రెమిషనిస్తున్నామంటారు. ఇది ఎకరానికి నాలుగు వందలొస్తే గొప్ప. ఎందుకిచ్చినట్లూ, కళ్ళ నీళ్ళు తుడవడానికే. ఇటువంటివి పధకాలు, పండ్ల తోటల పెంపకమని, కూరగాయల పెంపకమని, చాలా పధకాలుంటాయి అయిన వారికి కట్టబెట్టడానికి. మరొక గొప్ప విషయం విత్తనాలు. అమ్మో దీనిలోఉన్నంత మతలబు మరెందులోనూ లేదండి. విత్తనాలు తయారు చేయడానికి రైతులను ఎంచుకుంటున్నామంటారు. ఒక ఊరు నిర్ణయిస్తారు, ఆ ఊరు కావల్సిన వారిదై ఉంటుంది. విత్తనాలు పండించిన వారికి రేటు ఎక్కువ చేసి ప్రభుత్వం కొంటుంది. ఆ విత్తనాలు రైతులకమ్ముతారు. అందులోనూ మోసమే. మొలక శాతం రాని విత్తనాలు ఎన్నో. ఏమండీ మొలక శాతం లేదు అని అడిగితే, డీలరు, ఇది ప్రభుత్వం వారిది నేనేమి చేయను అంటాడు. కొన్ని చోట్ల మొలక బాగానే వస్తుంది, కాని దిగుబడి ఉండదు. డీలర్ని అడిగితే, మీరు వ్యవసాయం సరిగా చేయలేదంటాడు. ఇక ప్రయివేటు విత్తన తయారీ దారులకి కూడా సబ్సిడీ లిస్తారు. వాళ్ళూ మా వాళ్ళే. పురుగు మందులది ఒక పెద్ద ప్రహసనం. దోమ పట్టింది ఏమి మందు కొట్టాలి, చెప్పే నాధుడు లేడు. ఒక వేళ ఎక్కడేనా చెబితే, ఆ తెచ్చిన పురుగుమందుకి పురుగులు చావవు. ఇదో పెద్ద మోసం. పనికి రాని పురుగు మందులమ్మినా ప్రభుత్వం ఏమీ చేయదు. కాదు చేయలేదు. ఈ మందుల తయారిదారులకీ రాయితీలుంటాయి. ఇక పెట్టుబడికి అప్పులు ఇది రేపు చెబుతా. విత్తనాల దగ్గరనుంచి ప్రతి దానిలోనూ మా చెయ్యి ఉంటుంది. ఎవరూ మమ్మలిని ఏమీ చేయలేరు, ఎరికయిందా. సామాన్యుని దక్కేది, చిప్పే. ఇదండి ఆరు లక్ష్ల కోట్ల సొమ్ముకు వినియోగం, అన్నాడు మా సత్తి బాబు.
మిగిలిందీ ఆఖరిదీ రేపు.
farmer is the back bone of the nation, so he only can be backstabbed
@మిత్రులు ఫణీంద్ర గారు,
వెన్నెముకను పొడుచుకుంటే మిగిలేది శవం, శివం కాదు.
ధన్యవాదాలు.
అయ్యా శర్మ గారు,
ఈ సత్తి బాబు గారు ఎవరో గాని, భారద్దేశ ఆర్ధిక విధానాన్ని పిండి వడియాలు వేసేశారు ! అమ్మోయ్, ఈ ఆరు లక్ష కోట్ల వెనుక ఇంత కథ ఉందా ! జనావళి వద్ద ముక్కు పిండి వసూలు చేసిన టాక్సులు స్వాహా !
డబ్బు ఆడితే గాని డొక్క ఆడదాని … ఈ మార్క్స్ చెప్పినా చెప్పెను గాని.., డబ్బు ఈలా నాట్య మాడితే రైతు కళ్ళకి కన్నీళ్లు, కాళ్ళకి వేన్నీళ్ళు మాత్రమే అన్నట్టు ఉన్నది.
రేపటి విశ్లేషణ కై చూస్తాను. ప్రణబానందుని ఫైనాన్సు వ్రణ ప్రతిపాదికలు ! దాదా వెను వెనుకే మార్కెట్టు డాం అన్నట్టు ఉంది శుక్రవారం ! ఇవ్వాళేమౌతుందో మరి ?
చీర్స్
జిలేబి.
@జిలేబిగారు,
ధన్యవాదాలు.