ముందుంది ముసళ్ళ పండగ.
”ముందుంది ముసళ్ళ పండగ”
ఇదొక జాతీయం, ఇది ఒక సినిమాలో రచయిత మేధా శక్తితో ”ఇన్ ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్ఛివల్” గా అపభ్రంశం చెందింది, అదేవాడుకలో ఉన్నది,నేటివారి మెదళ్ళలో. 🙂 అసలర్ధమేంటీ? అసలు కష్టాలు ముందున్నాయీ అన్నదే దాని సారాంశం.
ముసురు ఏకవచనం ముసుళ్ళు బహువచనం. తెనుగులో ఏక,బహువచనాలే ఉన్నాయి. సంస్కృతంలో మాత్రం, ఏకవచనం,ద్వివచనం, బహువచనం లేదా అనేకవచనం అని మూడున్నాయి. ముసురు అనగానేమి? ఏడతెఱపి లేని వర్షం. ఎడ అన్నా తెఱపి అన్నా ఒకటే అర్ధం కాని ఎడతెఱపి అని వాడతారు, అగ్గి నిప్పులాగా 🙂 దీనికేంగాని…
ముసురు అనగా ఎడమివ్వని వర్షం అనుకున్నాం కదూ! ఈ వర్షం దబాటువానలా ఉండదు. చినుకు,చినుకు రాలుతూనే ఉంటుంది, ఇరవైనాలుగు గంటలూ. ఖతరా ఖతరా దరియా బన్ జాతీహై అన్నది ఉర్దూ సామెతనుకుంటా. అనగా బొట్టూ బొట్టూ నీరు సముద్రం అవుతుందని భావం.
వర్షాన్ని ”దుక్కి” లలో కొలిచేవారు, పాత రోజుల్లో వ్యవసాయ దారులు.. ఇది అపభ్రంశం చెంది దుక్కు, ఆతరవాత దిక్కుగా కూడా మారిపోయింది. ”ఒరే! ఒక దుక్కు వర్షం పడిందిగాని రేపు ఉదయమే అరక తోలుదాం” అన్నమాటలు వినపడేవి. ఒక్క సారి చాలు తోలడానికి తగిన వర్షం పడిందన్నది భావం. ఇలా రెండు సార్లు చాలు తోలడాన్ని ”ఇనుమారు” అనేవారు. ఇప్పుడీ మాటలు పల్లెలలో కూడా వినిపిస్తున్నట్టులేదు. సరే కవితా వ్యవసాయులకు ఇవేం పట్టినట్టూ లేవు.
వర్షాన్ని కొలిచేందుకు బహిరంగ ప్రదేశంలో చెట్టూ చేమా లేనిచోట ఎత్తుగా ఔన్స్ గ్లాసులాటిదానిని ఉంచి, చినుకులు చింది గ్లాసులో పడకుండా జాగర్తలు తీసుకుని, అందులో పడ్డ నీటిని కొలిచేవారు. అలా సంగ్రహించిన నీరు అరంగుళం ఉంటే ఒక దుక్కు వర్షం పడినట్టనేవారు. ఇప్పుడు వర్షాన్ని మిల్లి మీటర్లలో చెబుతున్నారు. ఈ సోదికేంగాని….
ఇలా ముసురు పడితే వారం పదిరోజులుండిపోయేది. ”పొయిమీదకి పొయి కిందకి ఉంటే వానాకాలమంత సుఖం మరోటి లేదురా” అనేది పెంచినమ్మ. ఇలా పొయిమీదకి అంటే ఆహార పదార్ధాలు సమృద్ధిగా ఉండడం., పొయి కిందకంటే ఎండు వంట చెరకు బాగా ఉండడం. పల్లెలలో వంట చెరుకు తడసిపోకుండా ఉండడానికి దూలలనుంచి రెండు తాళ్ళు, ఎడంగా కిందకి వదిలి వాటిని ముడేసి వాటి మీద వంట చెరకు పేర్చి ఉంచుకునేవారు. వర్షం ఎడతెఱపి లేకపడితే ఆహారపదార్ధాలు లేక, వండుకోడానికి కట్టెలు లేక బాధలు పడేవారు. ముసురు పడితే ఇంకా బాధలు, బయటికి పోలేకపోవడం, అనారోగ్యాలు చేయడం,మట్టి ఇళ్ళు వానకి నానిపోయి కూలిపోవడం, ఇలా అనేకమైన కష్టాలు ఉండేవి. ఒక ముసురుకే ఇలా ఐతే ఇక వరస ముసుళ్ళు పడితే బతుకు దుర్భరంగా ఉండేది. ఒకప్పుడు ఎండాకాలంలోనే ముసురు పట్టేది. ఇలా ఒక ముసురుకే బాధ పడుతుంటే రాబోయే శ్రావణ,భాద్రపదాలలోమరిన్ని ముసుళ్ళు మరింత బాధపెడతాయని హెచ్చరించడమే ఈ ముసళ్ళపండగ మాట.
నేడు ఒక సారి జనతా కర్ఫ్యూ చేసినంతలో కరోనా ఐపోలేదు, ముందు జాగరతలు ఇంకా తీసుకోవాల్సిందే.ఇప్పుడు కనక ఎండలకి తగ్గితే వర్షాలు పడ్డ తరవాత ఇది విజృంభిస్తుంది. చైనా ఇరవై రెండు వేల మంది సంప్రదాయ వైద్యుల్ని వైరస్ మొదలైన చోటికి తరలించి వ్యాధిని అదుపులోకి తెచ్చింది. ఈ వైద్య విధానమూ రహస్యంగానే ఉంచింది.ఈ నాటికి వేక్సిన్ లేని ఈ వైరస్ పట్ల జాగ్రత్తలు ఎక్కువ అవసరం. మన సంప్రదాయ ఆచారాలు మంచివి కాని వీటి పట్ల విముఖత పెచ్చుగా ఉన్నవారు ఆచరించడానికి బాధపడే సావకాశాలు కనపడుతున్నాయి. తస్మాత్ జాగ్రత జాగ్రత.
ఇంట్లో ఉండండిరా ఎవళ్ళనీ ముట్టుకోకండీ అంటే ఊరేగింపులు జరిపే మిమ్మల్ని ఎవడు కాపాడగలడు? ఇలాగే చేసి ఇటలీ వాళ్ళు పిట్టల్లా రాలి పోతున్నారు. మీ ముఖాన ఏం రాసి ఉందో ఎవరికెరుక. ఆరోగ్య సూత్రాలు పాటించమంటే వితండవాదాలు చేసే మిమ్మల్ని దేవుడు కూడా రక్షించలేడు.
దేశవ్యాప్తంగా రైళ్ళు రద్దయ్యాయి. విదేశాలనుంచి వచ్చిన వారు క్వారంటైన్ పాటించకపోవడం పరిపాటైపోయింది. క్వారంటై స్టాంప్ వేసినవారు రైళ్ళలో తిరుగుతున్నారు, కరోనా వ్యాప్తి చెందుతోంది. 80 జిల్లాలని మూసివేశారు. జాగ్రత్తలు తీసుకోండి, కష్టం గట్టెక్కమంటే తేలిగా తీసుకుంటే జాతికే నష్టం.
రాబోయే కాలంలో కష్టాలున్నాయన్నదే ముసళ్ళపండగ మాట.
శర్మ గారికి నమస్కారం ! చాలా కాలం తరువాత మీ టపా చూస్తున్నాను ! మీరు ఆరోగ్యం గా ఉంటున్నారని భావిస్తున్నాను ! కరోనా ‘ కాటు’ బారిన పడకుండా తగు జాగ్రత్త లు తీసుకోమని , మీ బ్లాగు ద్వారా మీరు చేస్తున్న ప్రయత్నాలకు అభినందనలు !
ప్రస్తుతం భారత ప్రజలందరూ అత్యవసరంగా చేస్తూ ఉండ వలసినవి :
1.సాధ్య మైనంత వరకూ ఇతరులనెవ్వరినీ కలవకుండా ఇంటి పట్టునే ఉండడం ! 2. బయటకు వెళ్ళ వలసిన అవసరం వస్తే , ఇతరులకు , కనీసం రెండు మూడు మీటర్ల దూరం లో ఉండడం . 3. బయటనుంచి ఇంటికి చేరిన ప్రతిసారీ కనీసం 20-30 సెకండ్ల పాటు సబ్బు తో చేతులు శుభ్రం గా కడుక్కోవడం ! 4. అశుభ్రమైన చేతులతో ముఖాన్ని తాకకుండా జాగ్రత్త పడడం ! కరోనా వైరస్ బారిన పడిన వారిలో 80 ఎనభై శాతం మంది తేలిక పాటి లక్షణాలతో నే బయట పడుతున్నా , మిగతా ఇరవై శాతం లో ఎవరుంటారో , ఎవరికీ తెలియదు కానక పై జాగ్రత్తలు అందరికీ అత్యవసరం ! ఇంకో విషయం , లక్షణాలు కనిపించని వారు కూడా , ఈ వైరస్ ను ఇతరులకు ( తమకు తెలియకుండానే ) వ్యాపింప చేసే ప్రమాదం ఉంది ! అందుకే పై జాగ్రత్తలు అందరూ పాటించాలి ! ప్రస్తుతం బ్రిటన్ లో రోజుకు 6-7 వందలకు పైగా ప్రజలు మరణిస్తున్నారు !
భవదీయుడు Dr .సుధాకర్ . ( UK )
డాక్టర్ సుధాకర్ జీ
వందనాలు.
మీరు నాపట్ల, మనదేశీయులపట్ల చూపిన ఆత్మీయకు ధన్యవాదాలు. నా ఆరోగ్యం ఎనిమిది పదులలో ఉండాల్సినట్టుగానే ఉంది.ఈ సమయంలో బ్లాగును వదలలేని బలహీనత.మీరక్కడ పిల్ల పాపలతో కుశలంగా ఉండాలని కోరిక.
కరోన ఒక మహమ్మారి, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రభుత్వం చెప్పినది చేసి తీరాల్సిందే. నా ఇష్టం అనడానికి లేదు. నా ఇల్లు నేను తగలబెట్టుకుంటానంటే కుదరదు. నీ మూలంగా పక్కవాడి ఇల్లు తగలబడుతుంది. మనం బతికి తీరాలి మరొకరూ బతికితీరాలి. చెబుతున్నవన్నీ పాత అలవాట్లే ఒక్క సారి ఆచరించడం మొదలు పెడితే ఆనందంగా ఉంటుంది,ఆరోగ్యంగానూ ఉంటుంది. ఈ రోగానికి మందులేదు కనక దానిని దగ్గరకు రాకుండా చూసుకోడమే మంచిదని అందరూ చెబుతున్న మాట.
ప్రతి దగ్గు,తుమ్ము రొంప, జ్వరం కరోన కాదు, అంతకు మించి లక్షణాలు పెరుగుతుంటే తప్పక వైద్యులను ఆశ్రయించాలి. అక్కడ కూడా ఎవరిని ముట్టుకోవద్దు. వారికి మనం సంక్రమింపజేస్తున్నామో, మనం సంక్రమింపజేస్తున్నామో తెలియదు. ప్రభుత్వాన్ని తిట్టుకోడానికి ముందు మనం బతికుండాలి కదా. ఆతరవాత మన ఇష్టం వచ్చినట్టు తిట్టుకోవచ్చు. బతకంది, ఇతరులను బతికించండి. Live and see that others also live. may be Live let live
మా దగ్గర మీ దగ్గరున్నంత తీవ్రత లేదు. అందుకు భగవంతునికి నమస్కారాలు.
ధన్యవాదాలు.