బతికియుండిన శుభములబడయ వచ్చు.
వినాశే బహవో దోషా జీవన్ భద్రాణి పశ్యతి
తస్మాత్ ప్రాణాన్ ధరిష్యామి ధ్రువో జీవితసంగమః
రామాయణమ్..సు.కాం..సర్గ 13–౪47
మరణించుట వలన పెక్కు ప్రమాదములు కలుగవచ్చును.బ్రతికియుండిన సుఖముల బడయవచ్చు. బతికియున్నవారెప్పుడైనను కలియవచ్చు,అందువలన ప్రాణములు నిలుపుకొందును.
హనుమ లంకలో దిగారు. సీతకోసం వెతికి వేసారిపోయారు, సీత కనపడలేదు. ఒక బలహీన క్షణం లో ఆత్మహత్య చేసుకోవాలనుకుంటారు, మార్గాలు కూడా ఆలోచిస్తారు. అంతలో ఇదేమి ఇలా ఆలోచిస్తున్నానుకొని లంకిణిని గెలిచి శుభారంభం చేశాను. బతికియుండిన శుభములు బడయవచ్చు, బతుకుతాను,నా వారందరిని బతికించుకుంటాను అని నిర్ణయం తీసుకుంటారు. ఇది పాసిటివ్ తింకింగో మరేదో మీరే చెప్పాలి.
తెలిసో,తెలియకో చైనా ఒక వైరస్ ని ప్రపంచం మీద వదిలింది. దానిని ఎలా ఏ మందులతో ఎదుర్కొంది చెప్పటం లేదు. తన దేశంలో ఎంతమంది మరణించిందీ పూర్తిగా తెలియని విషయమే. అమెరికా, అగ్రరాజ్యం అల్లాడుతోంది మందులకోసం.భారత దేశం కరోనాని సమర్ధంగా ఎదుర్కుంటోంది. ఎలా మడితోనూ, గచ్చాకు పుచ్చాకుతోనా అని హేళన చేస్తున్నవారూ లేకపోలేదు. మనవారికి మందులు లేకుండా ఇతరదేశాలకి మందులు అమ్ముకుంటోంది భారత ప్రభుత్వం , ఇది మరో అసత్య ప్రచారం. అవే కావాలంటోంది అగ్రదేశం. మానింది మందు బతికింది ఊరు అని సామెత.
దేశంలో వలస కార్మికులు ఆకలితో అల్లాడుతున్నారని కొందరి ప్రచారం. మా దగ్గర లాక్ డవున్ ప్రకటీంచిన మరునాటి నుండే వ్యక్తులు సంస్థలు ఆహారం అందించడం మొదలు పెట్టాయి. స్కూళ్ళు కాలేజిలు వసతి కూడా ఏర్పాటు చేశాయి. మానవత వెల్లి విరిసింది. మన వారిని బతికించుకోడమే మన ప్రధమ కర్తవ్యం.బతికియుండిన సుఖముల బడయ వచ్చు నన్నదే నినాదం. ఒక ఫోన్ నంబర్ ఇచ్చి దీనికి ఫోన్ చేయండి, మీకు ఎక్కడైనా మనఊరిలో, ఎంతమందికైనా ఆహారం ఇస్తామని చెప్పి అమలు చేస్తున్నవారున్నారు. స్వలాభాపేక్ష మరచి ఏ కూరైనా కెజి ఇరవైకే అమ్ముతున్నవారున్నారు. అసత్యాలు అర్ధ సత్యాలు ప్రచారం చేస్తున్నవారున్నారు. ప్రభుత్వం ఇంటికే కావలసిన సరుకులు చేరేస్తోందన్నది మరచిపోయారు మరికొందరు.ఆర్ధికంగా వెనకబడిపోతున్నాం,మరొకరి సన్నాయి నొక్కులు. అసలు బతికి ఉన్నప్పుడు కదా, బతికుంటే నేడు కాకపోతే రేపు సాధించుకుంటాం, మరొకరి మాట
దేశం కరోనాని జయించగలదు అనే నమ్మకాన్ని కలిగి ఉంది.దేశం మొత్తం మీద ఇటువంటి వ్యక్తులు సంస్థలు చాలానే పని చేస్తున్నాయి. మందు కూడా కనుక్కునేలాగే ఉంది.ప్రపంచ దేశాలతో పోలిస్తే మరణాలు చాలా తక్కువనే చెప్పాలి.ప్రపంచం మనకేసి చూస్తోంది,ఆశ్చర్యపోతోంది కూడా. బతుకు బతికించు అన్నదే నేటి నినాదం.జీవితం చూసిన ఒకరి మాట.కరోనాని దూరంగా తరిమేస్తున్నట్లే నిత్య శంకితులను దూరంగా వదిలేయండి, మీ పని మీరు చేసుకోండి. IGNORE them.
తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు
చేరి మృగతృష్ణలో నీరు త్రావ వచ్చు
తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు
చేరి మూర్ఖులమనసు రంజింపరాదు.
సర్వే జనాః సుఖినో భవంతు
సమస్త సన్మంగళాని భవంతు
నిత్య శ్రీ రస్తు
నిత్య మంగళాని భవంతు
సర్వ శ్రీ రస్తు
సర్వమంగళాని భవంతు
సర్వే జనాః సుఖినో భవంతు.
దేశంలో వలస కార్మికులు ఆకలితో అల్లాడుతున్నారని కొందరి ప్రచారం.
ఇది ప్రచారం కాదు, నిజం. ఇది చదవండి.
జాతీయ రహదారుల మీద పగిలి నెత్తురోడుతోన్న అరికాళ్ళ ముద్రలు. రోళ్ళు పగిలే ఎండల్లో నిండు నెలల గర్భిణుల నడకలు. నిలువ నీడ లేని దారుల్లో ప్రసవం. ఆగే వీల్లేని బ్రతుకుని మోసుకుంటూ తారురోడ్ల మీద పచ్చి కడుపులతో ఆ తల్లుల ఎడతెగని ప్రయాణం. పెద్దలు, పిల్లలు, వృద్ధులు, అనారోగ్యులు అందరిదీ అదే దారి. అదే వరస. ఊరెటో తెలీదు. ఇంకెంత దూరం వెళ్ళాలో లెక్కేలేదు. వెళ్ళగలరో లేదో తెలీదు. భాష రాదు. బస్సు లేదు. రైలు లేదు. చేతిలో చిల్లిగవ్వ లేదు. కనీసం అరికాళ్ళకు చెప్పుల్లేవు. ఎక్కడా ఆగి ఆశ్రయం పొందగల పరిస్థితి అసలే లేదు. గత రెండు నెలలలో రాష్ట్రాలకు రాష్ట్రాలు దాటుకుంటూ కోట్లాది వలస కార్మికులు చేసిన హృదయవిదారకమైన ప్రయాణంలో మచ్చుకి కొన్ని దృశ్యాలివి. ఎలాగోలా ఇల్లు చేరాలన్న వెర్రి ఆశకి ఆకలి, వ్యాధి భయం, అధికారులు ఎక్కడ ఎందుకు అడ్డగిస్తారోనన్న బెరుకు తప్ప ఏం తోడున్నాయి వారికి? అవసరానికి వాడుకోవడమే తప్ప ఏ సమాజమూ సొంతంచేసుకోని ఏకాకితనం ఈ వలసజీవులది.
కరోనా వైరస్ ప్రపంచమంతటినీ అతలాకుతలం చేసింది. రవాణా వ్యవస్థలు స్థంభించిపోయాయి. సామాజిక జీవితం సగటుజీవి మరపుపొరల్లోకి నెట్టేయబడింది. లక్షలలో నిరుద్యోగులవుతున్నారు. ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతోంది. బలవంతంగా మీదపడ్డ ఒంటరితనం, ఉన్నట్టుండి మారిపోయిన జీవితం, ఉక్కిరిబిక్కిరిచేసే బాధ్యతలు, కనీసావసరాలు తీరేందుకు ఏర్పాటు చేసుకోవాల్సిన తొందర–ప్రపంచమంతా అనుభవించిన వొత్తిడిలో స్థాయీభేదాలుండవచ్చునేమో కాని, ఉదాసీన వాతావరణం మాత్రం ఎక్కడా లేదు. ఇట్లాంటి పరిస్థితికి ఏ దేశపు ప్రజలూ సిద్ధపడి లేరన్నది వాస్తవం. ఏ ప్రభుత్వమూ ఎన్ని ముందస్తు జాగ్రత్తచర్యలు తీసుకున్నా నూటికినూరుశాతమూ తన ప్రజలను కాపాడుకోలేదనీ అర్థం చేసుకోగలం. కానీ, గత కొన్నాళ్ళుగా భారతదేశంలో మనం చూసిన వలసజీవుల కన్నీటిచరిత్ర, ఒక పరిపాలనావ్యవస్థగా మనమెంత హీనస్థితిలో ఉన్నామో సుస్పష్టం చేసింది. ఇందరు వలసకార్మికులు అప్పటికప్పుడు అమలైన లాక్డౌన్తో అటు పనిలేక, భత్యంలేక, బ్రతుకులేక, భద్రతలేక, ఇంటికిపోయే దారిలేక గిలగిలలాడిపోతూ నడివేసవిలో సామాను నెత్తిన పెట్టుకుని రాష్ట్రాలకు రాష్ట్రాలు దాటి నడిచిపోతుంటే, సరిహద్దుల దగ్గర ఆపి చోద్యం చూసిన పాలకవ్యవస్థను ఏమనాలి? ప్రజల క్షేమం చూడాల్సిన ప్రభుత్వం వారిపైనే తమ జులుం చూపించడాన్ని ఇంకేమనాలి? సమాజంలోని ఒక భాగానికి కనీస రక్షణ కరవవుతున్నప్పుడు, నిర్లజ్జగా వాళ్ళనలా వదిలేసి చేతులు దులుపుకోవడం ఎంత అమానుషం! కులాన్ని, మతాన్ని, ధనాన్ని మత్తుమందుగా ప్రజలకు పంపిణీ చేసి అవసరానికి పబ్బం గడుపుకునే మన ప్రభుత్వాల ప్రమాదకర ధోరణికి నిలువెత్తు ప్రతీక ఈ వలసకార్మికుల మహానిర్గమనం. అయితే, రాజ్యం నీళ్ళొదిలేసిన బాధ్యతను సామాన్య ప్రజానీకం తలకెత్తుకుంది. ప్రభుత్వం గుడ్డిదైనచోట మానవత్వం కళ్ళు తెరిచింది. సాటి మనుషుల కష్టానికి చలించిపోయిన సామాన్యులెందరో తమ శక్తికి మించి, వలస కార్మికులకు ఎంతో కొంత కడుపు నింపి వారిని ఆదరంతో గౌరవంతో ఇళ్ళకు చేర్చడం కోసం తపించారు, శ్రమించారు. చీమూ నెత్తురూ లేని రాజకీయనాయకులు వారి శ్రమను తమదిగా ప్రచారం చేసుకుంటున్నా, అహంకారంతో అధికారయంత్రాంగం అడ్డుపడుతున్నా అన్నింటికీ ఎదురొడ్డి మరీ అనుకున్నది సాధించారు. మనుషుల్లో మానవత్వం ఇంకా బ్రతికే ఉందని ఇంత గొప్పగా ప్రకటించి, అది ఎన్నటికీ సమసిపోదని భవిష్యత్తు పట్ల భరోసా ఇచ్చి, దేశమంటే మట్టి కాదు, దేశమంటే ప్రభుత్వం కాదు, దేశమంటే మనమేనని మరొక్కసారి గుర్తుచేసిన ఆ మానవీయశక్తులందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాం.
ఇదే పాజిటివ్ థింకింగ్ .. మాష్టారూ.. మళ్ళీ బ్లాగ్ లు చదవడం ఇపుడే మొదలెట్టాను.. మనుషులను పుస్తకాలను చదివిన కొలదీ అసహనం. నిత్యజీవనంలో మంచి అన్నది కొంచెమైన కానరాక. మీ మాటలు గొప్ప దైర్యాన్నిస్తాయి. 🙏
పెద్దవారు గా మంచి మాట చెప్పారు sir. గడ్డుకాలం లో ఆపన్నహస్తం, సేవలు అందిస్తున్న వారికి వందనాలు.
సాధారణ దినాలలోకంటే ఇప్పుడే తాజా కూరలు పండ్లు బాగా దొరుకుతున్నాయి. కాలుష్యం తగ్గింది.
పూర్తిగా అనుకోవద్దుగాని కొంచం మేలు,అంతకే సంతోషం కదా!