ఈర్ష్యాళువు,జుగుప్సావంతుడు,క్రోధనుడు,నిత్య శంకితుడు,నిస్సంతోషి, పరభాగ్యోపజీవి అనువారరుగురు దుఃఖ భాగులు అన్నారు చిన్నయసూరి, అంటే ఎప్పుడూ ఏడ్చేవాళ్ళు,వీళ్ళకి మిగిలేది అదే…. . వీరిలో ఒక్కొకరిగురించీ వివరంగా చూద్దాం, ఒక టపాలో కుదరదూ…
మనలో ఆరుగురు అంతఃశ్శత్రువులున్నారన్నారు పెద్దలు, వారు కామ,క్రోధ,లోభ,మోహ, మద,మాత్సర్యాలూ అని చెప్పేరు. వీటి ప్రతి రూపాలే, ఈ దుఃఖభాగులు. ఇవన్నీ గాడిద గుడ్డూ అన్న మేధావులూ ఉన్నారు. వారికి నమస్కారం.
ఈర్ష్య, అసూయ,ద్వేషం ఇవన్నీ మనసుకి సంబంధించినవే. ఒకే కొమ్మకి, రెమ్మకీ ఉన్న ఆకులే.మనకంటే పైనున్నవారిని చూసి అనుకునేదే, ఈర్ష్య.. ఒకరితో పోల్చుకోవడంతో ఈర్ష్య ప్రారంభం. ’మనకంటే అందంగా ఉందే!’ ’మనకంటే చదువు’కొన్న’వాడే!’ ఇలా ప్రారంభమైన ఈర్ష్య ఆ తర్వాత అసూయగా పరిణామంచెంది ’మనకంటే ఏం అంత అందం, ఎర్రతోలుండగానే అందమేనా?’ ’మనకంటే మరో డిగ్రీ ఉండగానే మేథావి అయిపోతాడా?’ ఇక్కడితో ఆగిపోతే సమస్య ముదరదు, కాని ఆ తర్వాత మెట్టుకి ఎక్కకుండా ఉండలేరు, అదీ మానవ దౌర్బల్యం. ఇదే ద్వేషం. ఇప్పుడు మొదటి రెండు మెట్లమీంచి మూడవ మెట్టు మీదకి చేరిన వ్యక్తి చర్యలకి దిగిపోతారు. ’ఆ ఆందమంతా ప్లాస్టిక్ సర్జరీట, లేదా అందం శాశ్వతమా? గుణంకాని, ఆవిడకి గుణమే లేదుట,’ అని, చాటింపు వేయడం ప్రారంభం అవుతుంది. అదే ఉద్యోగస్థుడయితే ’అతనో లుఛ్ఛాట,అతనికున్నవి దొంగ డిగ్రీలుట వాకబు చెయ్యండని’ ఆకాశరామన్న ఉత్తరాలు రాసే పనిలో ఉంటారు.
ఈ ఈర్ష్య అసూయ ద్వేషాలకి ఎవరూ అతీతులు కారు. ఆడ, మగ తేడా లేదు, చిన్న,పెద్ద భేదం లేదు. చదువుకున్నవారు, చదువుకోనివారనే వివక్షాలేదు. అసూయ ముందుపుట్టి ఆ తరవాత ఆడవారు పుట్టేరంటారు, కాని నిజంకాదు. దీనికి లింగ భేదం లేదు. వీరు ఏ పనీ స్వయంగా చెయ్యలేరు, ఒక్కటి తప్పించి, మరొకరిని మాత్రం బాగా రెచ్చగొట్టగలరు, ఇది వీరి ప్రత్యేకతా 🙂 ఒక చిన్న ఉదాహరణ నా జీవితం లో జరిగినదే. ఒక మిత్రుడు, ఇప్పుడు కాలం చేసేడు. ఒక సారి మాటలలో జూలియస్ సీజర్ నాటకం లో ’కేసియస్’ పాత్ర గురించి ఒళ్ళు మరచిపోయి అనర్గళమైన ఉపన్యాసం ఇచ్చేడు. ’మీకంత ఇష్టమా ఆ పాత్రంటే’ అన్నా నెమ్మదిగా. అతనా ఊపులోనే ’అవును’ అన్నాడు. ఒక్కసారి అతని నిజ రూపం కనపడేటప్పటికి భయపడ్డా,జాగ్రత్త పడ్డా, నన్ను నేను సరిచేసుకున్నా, ఆ తరవాత కాలం లో. పాపం అతను దురదృష్టవంతుడే, ఈర్ష్యకే బలయిపోయాడు. నేటి కాలానికి కూడా చదువుకోనివారికంటే చదువుకున్నవారిలోనే ఇది ఎక్కువగా కనపడుతోంది. ఎందుకనీ? మాలాటి చదువుకోనివారికి పెద్దలు చెప్పిన మాటలు జీర్ణించుకుపోయాయి మరి మెధావుల పరిస్థితి అదికాదుగా, చదువుకోకముందు కాకరకాయ అన్నవారు చదువుకున్న తరవాత కీకరకాయ అంటున్నారు. చదువులో కూడా మొదటి భాగం ఇదే అనుకుంటా, రేంక్ రావాలి ఎదుటివారిని దాటిపోవాలి, ఎలాగైనా సరే, ఇదీ ఈర్ష్యకి పరాకాష్ట, పిల్లలకి చిన్నప్పటినుంచి నూరిపోస్తున్నారు, మేధావులు. చరిత్రలో చూస్తే దీనికి గొప్ప ప్రతినిధి కనపడతాడు, దుర్యోధనుడు. ఇంకా చాలా మంది ఉన్నారు, వెతుక్కోండి.
మన మనసులోకి తొంగి చూచుకుంటే, మనలో మనకే ఈ ఈర్ష్యాళువు కనపడతాడు, భయపడకండి, పిచ్చి డాక్టర్ దగ్గరికి పరిగెట్టక్కరలేదు, నిదానించండి, చాలు…
ప్రతివారిలోనూ ఈ ఈర్ష్య ఉంటుంది, నాకు ఈర్ష్య లేదనేవారిని అసలు నమ్మద్దు. ఈర్ష్య లేనివాళ్ళిద్దరే. మనలో ఉన్నది బయట పడినపుడు, ’అరే! ఇలాజరిగిందేమీ’ అని లోపలికి తొంగి చూచుకుంటే, సరిచేసుకుంటే, ఆత్మ విమర్శ చేసుకుంటే, చాలు మనమే బాగుపడతాం. ఈర్ష్యలో పడిపోవడం సహజం,పెద్ద తప్పుచేసేమనే ఆత్మ న్యూనతా భావం లో పడిపోనక్కరలేదు. పడిలేవడమే గొప్ప. మళ్ళీ పరుగేపెట్టాలి. ఇది చెప్పడం తేలిక, జీవితం లో అమలుచేయాలి అదీ గొప్ప. అమలు చేయలేకపోతే పడిపోయి ఉండిపోతే, ముడుచుకుపొతే, సహజం ముడుచుకుపోవడం, కాని అలా ముడుచుకుని ఉండిపోవడమే తప్పు……
యధా కన్దుకపాతే నో త్పత త్యార్యంః పతన్నపి,
తధా త్వనార్యః వతతి మృత్పిణ్డపతనం యధా……భర్తృహరి.
కందుకమువోలె సుజనుడు
క్రిందంబడి మగుట మీదికి న్నెగయుజుమీ
మందుండు మృత్పిండమువలె
గ్రిందంబడి యడగి యుండు కృపణత్వమునన్…….లక్ష్మణకవి.
భావం;- మంచివాడు పడిపోయినా నేలకి కొట్టిన బంతిలా పైకి లేస్తాడు కాని, మందుడు అనగా చేతకానివాడు మట్టి ముద్దలా నేలకి అంటుకుపోతాడు, పడిపోతే.
మళ్ళీ నేలకి కొట్టిన బంతిలా పైకి లేవాలి, పడిపోడానికి కారణమైన తప్పు తెలుసుకోవాలి, వదిలేయాలి, అంతే కాని ఆత్మ న్యూనతతో నేలకి కొట్టిన మట్టి ముద్దలా నేలకి అతుక్కుపోతే? మనం గొప్పవాళ్ళం ఎలా అవుతాం, ఇది తెలుసుకోవాలి, మానసిక వైద్యులు కూడా మనల్ని బాగుచెయ్యలేరు, మనల్ని మనం బాగుచేసుకోగలిగినంతగా. ఇటువంటివి చాలా ఉన్నాయి మన సంస్కృతిలో, వాటిని తెలుసుకుంటే, తెలుసుకోగలిగితే…..అదీ గొప్ప.అన్నీ బాగున్నప్పుడు, అందరూ తోడున్నప్పుడు, అంతా పొగుడుతున్నప్పుడు నిలబడటం గొప్పకాదు. మన వెనకెవరూ లేనపుడు,ఎవరూ మాటాడనపుడు ఎదురుగాలి వీస్తున్నప్పుడు ధైర్యంగా నిలబడాలి, సాధించాలి, ఇందుకు ఆత్మ స్థైర్యంకావాలి, పిరికివాడిలా పారిపోకూడదు, అదీ గొప్ప. ఇందుకు మనం మాటాడే మాటలో సత్యం ఉండాలి, చేసేది ధర్మంగా ఉండాలి.
మాటకు బ్రాణము సత్యము
కోటకు బ్రాణంబు సుభటకోటి, ధరిత్రిన్
బోటికి బ్రాణము మానము
చీటికి బ్రాణంబు వ్రాలు సిద్ధము సుమతీ.
మాటకి ప్రాణం సత్యం, కోటకి భటుల సమూహం ప్రాణం, స్త్రీకి మానమే ప్రాణం, ఉత్తరానికి సంతకమే ప్రాణం.
గురువుగారు, ఇకనుంచి మిమ్మల్ని పొగడకూడదని తీర్మానిన్చుకొన్నా. మీరు చదువుకొని వారని అసత్యమొకటి మీద రుద్దుకుంటున్నారు. మీ బ్లాగుల్లో నేను చదివిన వాటిల్లో ఇది పనికిరాదు అనేది ఒక్కటి కూడా లేదు. చదివిన ప్రతిదాంట్లోను ఏదోఒక విలువైన మాట పొండుపరస్తూనే ఉన్నారు. ప్రతి చిన్న, పెద్ద విషయాలని చదివించేలా అధ్బుతంగా వ్రాయడం మీకు వరం. మీ అంత వినూత్నంగా కనీసం కామెంటు వ్రాయడం కూడా సాహసమే. మీకు సర్వదా భగవంతుని అనుగ్రహం ఉండాలని ప్రార్థిస్తూ…సెలవు.
durvas గారు,
🙂 నిజం చెబితే నమ్మరు. నాకు డిగ్రీలు, డాక్టరేట్లు లేవు. నేను చదువుకున్నది ఎస్.ఎస్.ఎల్.సి. నా మాట ఏదైనా ఒకరికేనా ఉపయోగపడితే ఆనందమే. మీ అభిమానానికి సర్వదా కృతజ్ఞుడిని.
ధన్యవాదాలు.
చాలా బాగుందండి..
Freebookbank గారు,
మీ సైట్ చూశా, బాగుంది, ఉపయోగించుకుంటా…వ్యాఖ్యకు
ధన్యవాదాలు.
శర్మగారు,ఎంతవద్దనుకున్నా మీ మాటలు మా నాన్నగారినే గుర్తుకు తెస్తున్నాయ్.మా చిన్నతనంలో అన్నలకు,నాకూ సెలవుల్లో పంచతంత్రం,మిత్రలాభం,మిత్రబేధం కధలు ఎంతో వివరించి చేప్పేవారు.అప్పటినుంచీ ఆయన చివరివరకూ మీరు వ్రాసిన ఈ పోస్టు సారాంశం మొత్తం సంధర్భం వచ్చినప్పుడల్లా చెప్పేవారు.అలా ఈరోజు ఉదయమే నాన్నను గుర్తుకు తెచ్చారు. అసలు మరచిపోయినదిలేదనుకోండి.మీ పోస్టు ఉదయమే చదువుతాను.అలా అనమాట.అందించినందుకు ధన్యవాదాలు.
mallalmpalli swarajya lakshmi గారు,
ఏం చెప్పాలో తోచటం లేదండి! మీ అభిమానానికి
ధన్యవాదాలు.