శర్మ కాలక్షేపంకబుర్లు-రాముని రాజ్యం-భరతుని పట్టం-2

జయత్యతిబలోరామో

లక్ష్మణస్య మహాబలః

రాజా జయతి సుగ్రీవో

రాఘవేణాభిపాలితః

(జయ మంత్రం)       హనుమ.  

శర్మ కాలక్షేపంకబుర్లు– రాముని  రాజ్యం-భరతుని పట్టం-1  continued

అవగాహన

దశరథుని పార్ధివదేహానికి అగ్ని సంస్కారం చేసిన తరవాత,రాముని తల్లి కౌసల్యను దర్శించాడు,భరతుడు.   తల్లీ! జరిగినదానిలోగాని, నా తల్లి కోరిన కోరికలలో గాని నా ప్రమేయం లేశమాత్రమున్నూ లేదు. ఏమాత్రం ప్రమేయమున్నా అనేక ఘోరమైన పాపాలు చేసినవాణ్ణి అవుతాను, అని ఒట్లు పెట్టుకున్నాడు. మనం అందరం వెళ్ళి రాముని వెనక్కు తీసుకొద్దామనీ చెప్పాడు.  ఆ తరవాత లక్ష్మణుని తల్లి సుమిత్రకు కూడా ఇలాగే చెప్పాడు. అందరం వెళ్ళి రాముని వెనక్కి తీసుకొద్దామని చెప్పేడు.  ఆపై సభచేసి మంత్రి,పురోహిత, పౌర, జానపదులుండగా, ఈ రాజ్యం రామునిది, రాముడే పరిపాలనార్హుడు.  నా తల్లి కోరినవరాలలో నా ప్రమేయం లేదు, అని ప్రకటించి, మనం వెళ్ళి రాముని వెనక్కు తీసుకొద్దామని చెప్పేడు.

ఆ తరవాత అనుకున్నట్టు అందరూ అనగా, రాణివాసం, సైన్యం,మంత్రులు,పౌరులు,జానపదులు కదలిరాగా రాముని కోసం అడవులకు బయలుదేరారు. పట్టపుటేనుగు సిద్ధంగా ఉన్నా భరతుడు గుఱ్ఱం ఎక్కేడు. పట్టపుటేనుగు హౌదా ఖాళీగా ఉండగా బయలుదేరింది. 

***

ఆలోచన

ఇంట గెలిచి రచ్చగెలవాలి, ఇదొక నానుడి, తెనుగునాట. ఇది రామాయణం లో భరతుడు చేసినదానిని బట్టే ,ఈ నానుడి పుట్టిందని నా నమ్మిక. తాను రాజ్యం రామునిదే అని నమ్మేడు, అదే చెప్పేడు,  ఆచరణలో చూపాడు.  అది అమలుకు, ముందు ఇంటిలో వారిని ఒప్పించగలగాలి,  జరిగినదానిలో తనప్రమేయం లేదని.. అందుకు ముందుగా రాముని తల్లి కౌసల్యను కలిసాడు,ఎన్ని ఒట్లు పెట్టుకున్నాడో, నేనైతే ఒట్లు పెట్టుకున్నాడని తేల్చేసేను.  ఆనాటికి ఘోరపాపాలేవైతే ఉన్నాయో అవన్నీ తాను చేసినవాడినౌతానని చెప్పేడు.  చివరికి మనం వెళ్ళి రాముని తీసుకొద్దామని చెప్పి పెదతల్లికి  నమ్మకం కలగజేసేడు. రామునికి బహిఃప్రాణం లక్ష్మణుడు, అలాగే తన బహిఃప్రాణం శత్రుఘ్నుడు, లక్ష్మణ, శత్రుఘ్నులు కవలపిల్లలు, సుమిత్ర కొడుకులు. అటువంటి సుమిత్ర దగ్గర ఏడ్చేడు, తనగోడు వినిపించేడు, కౌసల్య దగ్గర పెట్టుకున్నన్ని ఒట్లూ పెట్టుకున్నాడు, మనం రాముని వెనక్కు తీసుకురావడానికి వెళుతున్నాం, అనీ చెప్పేడు. నిజానికి ఇంత చెప్పక్కరలేదు, ఈ పెదతల్లికి, కాని చెప్పేడు. తన బహిఃప్రాణమైన తమ్ముడు, శత్రుఘ్నునికి తనేమిటో తెలుసు, తన తమ్ముని ద్వారా సుమిత్రకీ తెలిసి ఉండే సావకాశాలే మెండు. కాని అలాగని ఉపేక్ష చేయలేదు.కౌసల్య దగ్గర చెప్పినదంతా ఇక్కడా చెప్పేడు,  పెదతల్లికి  నమ్మకం కలగజేసేడు. ఆపై పౌరులు,జానపదులకూ  తెలిసేందుకుగాను సభచేసి ప్రకటించాడు.   తాను చెప్పడమే కాదు, అది నిజమనిపించేందుకుగాను, పట్టపుటేనుగు బయలుదేరినా దానిని ఖాళీగానే ఉంచి, తాను   గుఱ్ఱం మీద మాత్రమే బయలుదేరాడు.  ఎందుకిలా చేసాడు? రాజుమాత్రమే పట్టపుటేనుగు ఎక్కేందుకు అర్హుడు, తాను రాజుకాదని ప్రజలకి తెలియజేసేందుకే అలా చేసేడు. మరి పట్టపుటేనుగెందుకు ఖాళీగా? తిరిగి వచ్చేటపుడు రాముని కోసం. సైన్యమెందుకు? రాణివాసానికి రక్షణ. అంతేకాదు రాజు ఎప్పుడూ ఒంటరిగా ఉండకూడదు, సైన్యం కూడా ఉండాలి. తిరిగొచ్చేటపుడు రాముడు రాజు గనక సైన్యం కూడా ఉండాలి. ఇక మంత్రులు ఎందుకు? మంత్రులందరూ బుద్ధి కుశలురై ఉంటారు, అనుకోని అవాంతరాలలో ఆలోచనకి అవసరపడతారు. ఇక పౌరులు,జానపదులు ఎందుకు? పౌరులు,జానపదులూ నీ తిరిగిరాక కోరుతున్నారని  రామునికి తెలియజేసేందుకు, ముఖ్యులు కూడా ఉండేందుకు. ఇన్ని ముందు జాగరతలూ తీసుకున్నాడు, భరతుడు, రాముని తిరిగి రమ్మని చెప్పడానికి. అంతేకాదు తన ప్రయత్నలోపం ఉండకూడదనీ, తన ఆంతర్యం అందరికీ తెలియాలనీ ఇన్ని పనులు చేసేడు. భరతుడు బుద్ధిశాలి.  

ఇలా ఇంట నమ్మకం కలగజేసి,వారి మనసులు గెలిచాడు, ఇదే ఇంట గెలవడం. ఇక రచ్చ ఎలాగెలిచాడో తదుపరి చూదాం.

తరువాయి…

శర్మ కాలక్షేపంకబుర్లు– రాముని  రాజ్యం-భరతుని పట్టం-1 

రామం దశరథం విద్ధి

మాం విద్ధి జనకాత్మజం

అయోధ్యా అటవీం విద్ధి

గఛ్ఛ తాత యధా సుఖం

                                                సుమిత్రా దేవి

రాజ్యం రామునిదే, నాకీ రాజ్యం వద్దు, అన్నవాడు భరతుడు, ఇది నిజం కూడా, కాని ఈ నిజాన్ని నమ్మించడానికి భరతుడు పడ్డపాట్లు తెలుసుకోవలసినవే!    ”రామునిరాజ్యం-భరతుని పట్టం” అన్నదానిని ”రామరాజ్యం-భరతుని పట్నం” అని కూడా అంటుంటారు. నిజానికి, రాముని రాజుగా పట్టాభిషేకం చేసినది భరతుడే!!!

***

ఋషులు,మునులు, పౌరులు,జానపదుల అనుమతితో రామునికి యువరాజ పట్టాభిషేకానికి తలపెట్టేడు, దశరథుడు. సంగతి తెలిసిన కైక చాలా ఆనందించింది.  కాని మంథర, దశరథుడు కైకకిచ్చిన వరాలను గుర్తుచేసి, వాటిని కోరి, ”నీకుమారునికి పట్టాభిషేకం చేయించుకో” అని బోధచేసింది. ఆ మాట తలకెక్కిన కైక 

 వరాలు కోరింది.  రాముడు పదునాలుగేళ్ళు వనవాసం చెయ్యాలి, భరతునికి పట్టాభిషేకం చేయాలి. సీతారామ,లక్ష్మణలు నార చీరలుగట్టి అరణ్యవాసానికి వెళ్ళారు, దశరథుడు కైకకిచ్చిన వరాలు అమలు చేయడానికి. రాముని విడచి ఉండలేని దశరథుడు అసువులుబాసాడు. రామలక్ష్మణులు అడవులకు పోయారు, భరత శత్రుఘ్నులు, భరతుని మేనమామ ఇంట ఉన్నారు. దశరథునికి నలుగురు కొడుకులున్నా, చనిపోయేనాటికి ఒక్కరూ దగ్గరలేకపోవడంతో, అంత్యక్రియలు జరుపడానికి, తైలద్రోణిలో వేసి ఉంచారు. 

వశిష్టులు ఇలా కబురు పెట్టారు, భరత,శత్రుఘ్నులకు,”రాజకుమారులు అత్యవసరంగా అయోధ్యలో నెరవేర్చవలసిన కార్యం ఉన్నందున, సత్వరం రావలసింది”. కబురందుకున్న భరతుడు మేనమామ,తాతగార్ల అనుమతితో అయోధ్యకు  బయలుదేరాడు.

అయోధ్య చేరిన భరతునికి పట్టణం వెలవెల బోతూ కనపడింది. తిన్నగా తల్లి దగ్గరకు చేరాడు. తండ్రి మరణవార్త తెలిసింది, దానితో సీతారామలక్ష్మణులు అడవులకెళ్ళేరు, వనవాసానికనీ తెలిసింది. పెద్దవార్త తల్లి చెప్పింది, దశరథుని తాను వరాలు కోరినట్టూ, వాటి అమలుకుగాను రాముడు పదునాలుగేళ్ళు వనవాసం వెళ్ళినట్టు, భరతుని  పట్టాభిషేకం చేసుకోమని చెప్పింది.  విన్న భరతుడు హతాశుడయ్యాడు. తల్లిని  తూలనాడాడు, చివరగా తానెప్పుడైనా నవ్వులాటకైనా రాజ్యపాలన చేయాలని అన్నానా!  అని కూడా అడిగాడు.   పట్టాభిషేకం చేసుకోమన్న మంత్రి, పురోహిత,పౌరులకు తామందరం రామునివద్దకు వెళుతున్నామనీ, రాముని వెనక్కు తీసుకొచ్చి పట్టాభిషేకం జరిపిద్దామనీ చెప్పాడు.

****

అవగాహన:

తన ప్రమేయం లేకనే తనపట్ల నష్టం జరిగిపోయింది. విచలుతుడై తల్లిని తూలనాడినా, నష్ట నివారణ చర్యలు మొదలెట్టేడు.

తండ్రి మరణం, నష్టం పూడ్చుకోలేనిది, తండ్రి పార్ధివ దేహానికి అగ్ని సంస్కారం చేయడం తప్ప.

తన రాజ్య పట్టాభిషేకం, తన ప్రమేయం లేకనే తల్లి నిర్ణయించడం.  తన ప్రమేయం ఆ నిర్ణయంలో లేకపోయినా, అపార్ధం చేసుకునేవాళ్ళు. పెదతల్లులు, అన్న,వదిన,తమ్ముడు, మిగిలినవారు, బంధుకోటి,ప్రజలు. మొదట నష్ట నివారణ చర్యగా మంత్రులకు రాముని దగ్గరకు వెళుతున్నాం, వెనక్కి తీసుకురావడానికి, సిద్ధం చేయమని చెప్పడం.తండ్రికి అంత్య క్రియలు చేయడం.

ఇంకా కలిగిన నష్టాలను భరతుడు ఎలా అధిగమించాడో తరవాత  చూదాం.

**** 

ఆలోచన.

నాటి కాలానికే పార్థివ శరీరాలని పాడవకుండా ఉంచే ప్రక్రియలున్నాయని తెలుస్తోంది.

భరతునికి కబురుపంపినది వశిష్ఠులు, ఇదేమి? గురువులు కబురుపంపండం అనే ఆలోచనే రాలేదెవరికి. అయోధ్యలో జరిగినదేమో భరతునికిగాని అతని మేనమామ,తాతగార్లకూ తెలియదు. కబురు పంపినవిధం విచారణీయం.

భరతుడు తల్లిదగ్గరకు రాగానే తెలిసినవి పిడుగులాటి వార్తలు.తండ్రి మరణం, అన్నదమ్ములు,

వదిన అడవులపాలవడం, రాజ్యభారం వహించమని తల్లి చెప్పడం (తన ఇష్టానికి వ్యతిరేకంగా)ఒక్కసారిగా సంయమనం కోల్పోయేలా చేసాయి భరతుని. ఇంతటికి కారణం తల్లి అని గుర్తించి, తల్లిని తూలనాడేడు. 

జరిగినదానికి విచారించిన భరతుడు కర్తవ్యాన్ని గుర్తించి, తండ్రికి అంత్యక్రియలు నిర్వహిస్తూ మంత్రులకు తాము రాముని వెనక్కు తీసుకురావడానికి వెళుతున్నామని, బాటలు ఏర్పాటు చూడమని,సైన్యాన్ని సిద్ధం చేయమని, పట్టపుటేనుగును సిద్ధం చేయమని,తాను రాజ్యభారం వహించటం లేదని, రాముడే రాజ్యాధికారని చెప్పడం జరిగింది, మంత్రులు,పురోహితులు, పౌరజానపదులూ, పట్టాభిషేకం చేసుకోమని చెబుతున్నా.కొద్ది రోజులకితమే ఈ పౌరులే రాముని వెంబడించి అడవులకీ వస్తామన్నావారు. (Public memory short lived, అంటే ఇదేనేమో.)  

******

(విషయం పెద్దది. ఒక టపాలో రాయడం నా వల్ల కాలేదు. అందుకు భాగాలు చేయక తప్పలేదు, మన్నించాలి.  మొదలుపెట్టి చాలాకాలంగా పూర్తి చేయక వదలివేసినది. నేటికి పూర్తి చేయాలనే పట్టుదలతో ఈ భాగాన్ని పూర్తి చేయగలిగాను. మిగిలినది పూర్తి చేయాలని కోరిక, ఆపై అమ్మదయ.)

(విషయ సంగ్రహణ: వాల్మీకి విరచిత శ్రీమద్రామాయణం నుంచి. ప్రచురణ:గీతా ప్రెస్)

శర్మ కాలక్షేపంకబుర్లు-ఉదయ ప్రార్థన శ్లోకాలు/అర్ధాలు-పరమార్ధాలు.

ఉదయ ప్రార్ధన శ్లోకాలు-అర్ధాలు/పరమార్ధాలు.

బాల భాస్కరుడు

ఉదయమే నిద్ర లేచి మంచం దిగే ముందు పడకమీదనుంచే సెల్ ఫోన్ మొహం చూసిగాని మంచందిగటం లేదెవరూ! నేటి కాలంలో, కాని, కొంతమంది ఇంకా ఈ శ్లోకాలు పఠించి చివరి శ్లోకంతో మంచం దిగుతూ భూమికి నమస్కరించే వారున్నారు, అరుదుగా! 

అసలీ శ్లోకాలేంటి? వాటి అర్ధ పరమార్ధాలేంటీ?

గురు బ్రహ్మ గురు విష్ణుః

గురుదేవో మహేశ్వరః

గురు సాక్షాత్పర బ్రహ్మ

తస్మై శ్రీ గురవేనమః

గురువు బ్రహ్మ,విష్ణు, మహేశ్వరుడు, సాక్షాత్తు దేవుడు, అటువంటి గురువుకు నమస్కారం.

ఆపదామపహర్తారం

దాతరం సర్వసంపదాం

లోకాభిరామం శ్రీరామం

భూయో భూయో నమామ్యహం

ఆపదలనుంచి కాచేవాడు, సంపదలిచ్చేవాడు,ఎల్లరచే కొనియాడబడేవాడైన రామునకు మరల, మరల నమస్కారం.

కరాగ్రే వసతే లక్ష్మీ

కరమధ్యే సరస్వతీ

కరమూలే స్థితా గౌరీ

ప్రభాతే కరదర్శనం

చేతి చివర లక్ష్మి,మధ్య సరస్వతి, చెయి మొదట గోవిందుడు ఆవాసం చేస్తున్న చేతిని చూస్తున్నానని,అంటూ కనులు తెరచి,అరచేతుల్ని చూచి కనులకద్దుకుంటాం.

సముద్రే వసనే దేవీ

పర్వతే స్తనమండలే

విష్ణుపత్నీనమస్తుభ్యం

పాదస్పర్శం క్షమస్వ మే

సముద్రంలో తేలియాడుతున్న దేవత, పర్వతాలే స్తనమండలాలుగా ఉన్న విష్ణుపత్నియైన భూదేవికి నమస్కారం, కాలితో తొక్కుతున్నాను క్షమించు.

అంటూ కాలు భూమి మీద పెడతాం. 

జన్మనిచ్చిన తల్లి మొదటి గురువు బ్రహ్మ స్వరూపం, చిటికినవేలు పట్టి నడిస్తే లోకాన్ని చూపించిన గురువు తండ్రి విష్ణు స్వరూపం, అజ్ఞానాంధకారాన్ని జ్ఞానమనే వెలుతురుతో పాలద్రోలిన గురువు మహేశ్వర స్వరూపం. ఆ తదుపరి గురువే దైవ స్వరూపం అని నొక్కి వక్కాణించారు,అనగా తల్లి,తండ్రి, గురువులే దైవ స్వరూపాలని చెప్పేరు, గురు సాక్షత్ పరబ్రహ్మ అంటూ.అటువంటి గురువులైన తల్లి,తండ్రులకు, గురువుకు దైవానికి నమస్కారం. 

ఆతదుపరి

రామో విగ్రహవాన్ ధర్మః ఇది మారీచునిమాట, రాముడు మూర్తీభవించిన ధర్మం. ధర్మో రక్షతిః రక్షితః, ధర్మాన్ని ఆచరిస్తే ధర్మం రక్షిస్తుంది. అటువంటి ధర్మానికి మరల,మరల నమస్కారం,అంటే ధర్మాన్ని ఆచరిస్తానని ప్రతిన, ధర్మం రక్షిస్తుందని నమ్మకం. ధర్మానికి నమస్కారం.

చేతిలో లక్ష్మి, సరస్వతి, పార్వతి నివసిస్తారు. గోవిందా అంటే నారాయణి,  నారాయణి,నారాయణులకు అభేధం, అక్కడ గోవిందా అంటే పార్వతి, లలితాదేవి స్వరూపం. లలితా దేవికి మరో పేరు ఇఛ్ఛాశక్తి,జ్ఞానశక్తి,క్రియాశక్తి స్వరూపిణీ అంటారు. ఈ మూడు రూపాలూ బ్రహ్మ,విష్ణు, మహేశ్వరుల శక్తి రూపాలు. సర్వమూ నా చేతిలో ఉంది, నా ప్రయత్నంతో సర్వమూ సమకూడుతుందనే నమ్మిక,ప్రతిన. నా ప్రయత్నానికి దైవ శక్తి తోడవాలి,తోడవుతుందని కనులు తెరచి అరచేతులను చూచి కళ్ళకద్దుకుంటాం, ఇది స్వశక్తి మీద నమ్మకం కలగజేసుకోవడం.

సముద్రంలో నివసించే దేవీ, పర్వతాలే స్తనాలుగా కలిగిన, విష్ణుశక్తి స్వరూపిణి భూదేవికి నమస్కారం, కాలితో తొక్కుతున్నాను,క్షమించమని వేడటం. 

సముద్రంలో భూమి ఉందా,భూమి మీద సముద్రం ఉందా? వికట ప్రశ్న. పంచభూతాల సృష్టి క్రమం చూస్తే ముందు పుట్టినది, ఆకాశం, దానినుంచి పుట్టినది వాయువు, వాయువునుంచి అగ్ని పుట్టింది, అగ్ని నుంచి నీరు పుట్టింది,నీటి నుంచి భూమి పుట్టింది. ఇప్పుడు చెప్పండి నీటిలో భూమి ఉందా? భూమి మీద నీరు ఉందా? అదే సముద్రే వసనే దేవీ, పర్వతే స్తన మండలే, భూమిపైనున్న పర్వతాలని స్తనాలతో పోల్చారు. ఎందుకు? బిడ్డ పుట్టినప్పటినుంచి తల్లి ఆహారం పాల ద్వారా స్తనాలనుంచే ఇస్తుంది. అలాగే భూమి పైనున్న పర్వతాలు స్తనాలలా నీటిని నదులద్వారా ప్రజలకందజేసి, ఆకలి తీరుస్తూ ఉంది.విష్ణుపత్ని, విశ్వం విష్ణు సహస్రనామాలలో మొదటి రెండు నామాలు. సృష్టి సమస్తం విష్ణుమయం, “సర్వం విష్ణుమయం జగత్”, విష్ణువు శక్తి స్వరూపమే సృష్టి. మనకు కావలసిన ఆహారం నుంచి సర్వమూ భూమి నుంచి వచ్చేవే. భూమినుంచి పుట్టి భూమిలో కలసిపోతాం. అటువంటి భూమికి కృతజ్ఞతతో కూడిన నమస్కారం. 

శర్మ కాలక్షేపంకబుర్లు-ధృతరాష్ట్రుడు,ద్రౌపదికి వరాలెందుకిచ్చాడు? (జవాబు)

ధృతరాష్ట్రుడు, ద్రౌపదికి వరాలెందుకిచ్చాడు?(జవాబు)

భయపడి వరాలిచ్చాడు.

ఎవరికి భయపడ్డాడు?

ముగ్గురు, ఆ ఇంటికోడళ్ళకి.

ఎవరువారు?

1.గాంధారి.2.ద్రౌపది.3.కుంతి.

ఎందుకుభయపడ్డాడు

గాంధారి:- ఈమె ఒక ఉడుకుతున్న అగ్నిపర్వతం. తన ఎదురుగా, కొడుకు వదినగారిని కొప్పు పట్టి లాక్కుపోతుంటే మాటాడలేక అసహాయంగా ఉండిపోయినది.ఆమె మనసు కుతకుతలాడింది, జరుగుతున్న అన్యాయానికి.జూదం మాటెలావున్నా ఇంటికోడలికి జరుగుతున్న అన్యాయాన్ని సహించలేకపోయింది. అందుకే తనకొడుకులు నీచప్రవర్తన మరెంతకు దిగజారిపోతుందో, కర్ణుని సావాసంలోనని, బయలుదేరి విదురునితో కలిసి ధృతరాష్ట్రునికి సభలో జరుగుతున్నది చెప్పింది. ఆమెకు పుత్ర ప్రేమలేకపోలేదు కాని ధర్మం మీద కూడా ప్రేమ ఉంది. 

తార్కాణం:- యుద్ధానికి వెళుతూ తల్లిదగ్గరకొచ్చి నమస్కారం చేశాడు దుర్యోధనుడు, అపుడామె ’జయోస్తు’ ని దీవించలేదు, ’యతో ధర్మస్తతో జయః’ ఎటు ధర్మం ఉంటే అటు జయం కలుగుతుందని దీవించింది. అంటే దుర్యోధనుని పక్క ధర్మం లేదనేగా! తన కొడుకు పక్క ధర్మం ఉండి ఉంటే జయోస్తు అనే దీవించేది. మరో మాట కూడా. యుద్ధం అయిపోయింది యుద్ధరంగంలో చనిపోయిన వారిని చూస్తూ, దుర్యోధనుని శవాన్ని చూసి మళ్ళీ తన దీవెన గుర్తుచేసుకుని, నాడు సభలో చేసిన అకృత్యానికి ఫలితం అనుభవిచావా కొడకా అని ఏడ్చింది. 

ఈ అగ్నిపర్వతాన్ని చలార్చకపోతే మొదలుకే మోసం రావచ్చని భయపడ్డాడు. 

గాంధారి సభలో జరిగినది చెప్పిన తరవాత ప్రమాదాన్ని పసికట్టిన ధృతరాష్ట్రుడు కి జ్ఞాననాడి కదిలి నష్ట నివారణ చర్యలు మొదలెట్టేడు.   

ద్రౌపది:- ఈమె ప్రత్యక్షంగా అవమానానికి గురైనది, బద్దలైన అగ్నిపర్వతం, ఏ క్షణాన ఐనా లావా వెదజల్లచ్చు, అప్పుడు బాధపడి లాభం లేదు. ఆమె పట్ల కొడుకులు తప్పుజేసేరు. సభలో నేను దాసినా? అని అరిచింది తప్ప మరోమాట మాటాడలేదు.భార్య మానాన్ని కాపాడలేని నువ్వు మగాడివా? అని ఒక్క ప్రశ్న భీముని కనక వేసి ఉంటే!…. ఆమెగనక భీముని రెచ్చగొట్టి ఉంటే, ఆనాడు ఆ సభలో పీనుగులే ఉండేవి. ఈ అగ్ని పర్వతాన్ని ముందుగా చల్లబరచాలి, అనుకున్నాడు, భయపడ్డాడు

కుంతి:- ఈమె నివురుగప్పిన నిప్పు. గాలి ఊదితే చాలు మండిపోతుంది. ఈమె ఒక్క మాట కనక అంటే, ధర్మరాజుకు కబురంపితే, కోడలికి అన్యాయం జరుగుతుంటే చోద్యం చూస్తున్నారా? అని ఒక్క మాటంటే, అక్కడే కురుక్షేత్రం జరిగిపోయేది, అందుకు భయపడ్డాడు.

ఇంతేగాక ఆ రోజు సభలో కూడా ఎక్కువమంది జూదంలో జరిగినదానికంటే ద్రౌపది పరాభవానికే మండిపోయారు, అందుకు వెనక్కి జంకి నష్టనివారణ చర్యగా ద్రౌపదిని పిలిచి నువ్వు నాకోడళ్ళందరిలో ఎన్నదగినదానివని పొగిడేడు. ఆ తరవాత వరం కోరమన్నాడు, ఆమె ధర్మరాజు దాస్య విముక్తి అడిగింది, మరోవరమిస్తానన్నాడు, అప్పుడు మిగిలిన భర్తల దాస్య విముక్తి అడిగింది. ధృతరాష్ట్రుడు నిరాశపొందాడు, ఆమె రాజ్యం అడుగుతుందనుకున్నాడు,ఆమె అడగలేదు, అందుకు పాండవులందరిని పిలిచి రాజ్యం ఇచ్చి,అప్పటికి ఆ ఆపద నుంచి గట్టెక్కేడు. ఆ తరవాత జరిగిన అనుద్యూతానికి ఒప్పుకున్నాడు, కొడుకు చెప్పిన కారణాలకి.అసలు పాండవులను అడవులపాలుజేసి రాజ్యం కొడుక్కి కట్టబెట్టాలన్న ఆలోచన ధృతరాష్ట్రునిదే, దానికి తోడు దుర్యోధనుని అత్యాశ తోడయిందంతే! 

 స్వస్తి.

శర్మ కాలక్షేపంకబుర్లు-మళ్ళీ జూదం(అనుద్యూతం)

మళ్ళీ జూదం (అనుద్యూతం)

అంధ్రమహాభారతం,సభాపర్వం,ద్వితీయాశ్వాసం 270 నుండి 279 వరకు స్వేఛ్ఛానువాదం.

 జూదమయిపోయింది, ధర్మరాజు సర్వమూ కోల్పోయాడు, తననూ తమ్ములనూ కోల్పోయి శకుని చెప్పినట్టు ద్రౌపదిని ఒడ్డి ఓడి పోగా, ఆమె ఏకవస్త్రను, రజస్వలను అని చెబుతున్నా వినక దుశ్శాసనుడు కొప్పుపట్టి సభకు ఈడ్చుకురావడం, ఆపై  వస్త్రాపహరణానికి ప్రయత్నమూ జరిగింది. భీముని ప్రతినలూ అయ్యాయి. ఈ సందర్భంగా గాంధారి విదురునితో వచ్చి సభలో జరిగినిది సర్వమూ చెప్పడమూ జరిగింది, ధృతరాష్ట్రుడు ద్రౌపదిని పిలిచి రెండు వారాలివ్వడమూ జరిగింది, ఆమె అడగకపోయినా. ఆ తరవాత ధృతరాష్ట్రుడు ధర్మరాజును, తమ్ములందరితోనూ దగ్గరకు పిలిచి ధర్మరాజుకి,కొడుకులు చేసిన అకృత్యాలకి క్షమాపణ చెప్పి, వారి రాజ్యం వారికిచ్చి పంపించాడు. వారంతా ఇంద్రప్రస్థం వెళ్ళారు. 

“ఇక్కడ జరిగిన సంగతంతా దుశ్శాసనుడు అన్న దుర్యోధనుని చెవిని వేశాడు. దుర్యోధనుడు, కర్ణ, శకుని,సైంధవులతో ఆలోచించి ధృతరాష్ట్రుని దగ్గరకొచ్చి,ఎంతమంచి చేసినా పాండవులకు ప్రీకరమైనవాళ్ళమవుతామా? పగపట్టిన పాముని మెడలో వేసుకున్నట్టయింది, పొరపాటు చేసేసేం.బలవంతులైన అర్జున,భీమ, నకుల సహదేవులను యుద్ధంలో గెలవగలమా? అంచేత మళ్ళీ వాళ్ళని ద్యూతం లో ఓడించి దేశం నుంచి వెళ్ళగొట్టడం చేయవలసిన పనని ధృతరాష్ట్రుని చెప్పగా ఒప్పుకుని మళ్ళీ జూదానికి రమ్మని ప్రాతికామిని పంపించాడు. ప్రాతికామి చెప్పినకబురుతో ధర్మరాజు, అనుజ,భార్యా సహితుడై హస్తిన చేరాడు, తండ్రి మాట జవదాటలేనని, మిత్రులు ప్రజలు గోలపెడుతున్నా!. ఇదివరలాగే అదే సభాభవనంలో ఆసీనులుకాగా, శకుని ధర్మరాజుతో సంపదలు రాజ్యము మీకు ధృతరాష్ట్రుడు గౌరవంగా ఇచ్చేడు, కనక వాటిని పందెంగా ఒడ్డి అడటం కుదరదు.ఇప్పుడు నేను చెప్పే పందెం అపూర్వం. ఇందులో ఓడినవారు నారచీరలుగట్టి,బ్రహ్మచర్యంతో, కందమూలఫలాలు తింటూ, పన్నెండేళ్ళు వనవాసం చెయ్యాలి, పదమూడో ఏట జనపదంలో అజ్ఞాతవాసమూ చెయ్యాలి. అజ్ఞాతవాసంలో పట్టుబడితే మళ్ళీ పన్నెండేళ్ళు వనవాసమూ, ఆపై అజ్ఞాతవాసమూ చెయ్యాలి. ఇందుకు ఇష్టపడితే జూదమాడదామన్నాడు. ధర్మరాజు పందెం ఒడ్డేడు, ఓడిపోయాడు. అన్నట్టుగానే నారచీరలుగట్టి వనవాసానికి పోయారు.”  

కొద్దికాలం కితం జూదం జరిగినదానికి, కొడుకులు చేసిన అకృత్యాలకి క్షమాపణ చెప్పిన ధృతరాష్ట్రుడు, మళ్ళీ జూదానికెందుకొప్పుకున్నట్టు?

కొడుకు మొహమాటం లేకుండానే చెప్పేసేడు, వాళ్ళు బలవంతులు, యుద్ధం చేసి నెగ్గలేం. ఎలాగైనా వాళ్ళని రాజ్యం నుంచి బయటకి తోలెయ్యడమే కావలసింది, అనికూడా చెప్పేసేడు. ధృతరాష్ట్రునికి కావలసింది కూడా పాండవులు బయటికిపోవడమే! కాని అది తను చేస్తున్నట్టు ఉండకూడదు, అదీ ఉద్దేశం. మూలకారణం ధృతరాష్ట్రుడే! 

కితం సారి జూదం జరిగినపుడు సభంతా కలగుండుపడింది, నాడు జరిగిన విషయాలన్నీ అందరికి బాధ కలిగించాయి. గాంధారి అగ్నిపర్వతంలా ఉంది, ఎప్పుడు పేలుతుందో చెప్పలేనట్టు ఉంది. ఇక ద్రౌపది బద్దలైన అగ్ని పర్వతమే, వాళ్ళని చల్లార్చకపోతే నాడు కురుక్షేత్రం అక్కడే జరిగుండేది. అందుకు వరాలిచ్చి బులిబుచ్చి మాటలు చెప్పి వాళ్ళకి రాజ్యం ఇచ్చి పంపించేశాడు. ఇప్పుడు కొడుకు చెప్పిన పథకం నచ్చింది. ఇందులో రాజ్య ప్రసక్తిగాని, స్త్రీలను అవమానించే ప్రసక్తిగాని లేదు. పదమూడేళ్ళ తర్వాత ఏమగునో? ఎవరి కెరుక? అదేగాక అజ్ఞాతంలో దొరికితే మళ్ళీ అరణ్య,అజ్ఞాతవాసాలు చెయ్యాలి, పథకం బాగా నచ్చింది, ధృతరాష్ట్రునికి, అందుకే మళ్ళీ కబురు పెట్టేడు. ధర్మరాజుకి బుద్ధి లేదా? ఆయనదొకటే మాట తండ్రి చెప్పేడు, అంతే!

శర్మ కాలక్షేపంకబుర్లు-ధృతరాష్ట్రుడు ధర్మరాజుకు చెప్పిన క్షమాపణ.

జూదమయిపోయింది, ధర్మరాజు సర్వమూ కోల్పోయాడు, తననూ తమ్ములనూ కోల్పోయి శకుని చెప్పినట్టు ద్రౌపదిని ఒడ్డి ఓడి పోగా, ఆమె ఏకవస్త్రను, రజస్వలను అని చెబుతున్నా వినక దుశ్శాసనుడు కొప్పుపట్టి సభకు ఈడ్చుకురావడం, ఆపై  వస్త్రాపహరణానికి ప్రయత్నమూ జరిగింది. భీముని ప్రతినలూ అయ్యాయి. ఈ సందర్భంగా గాంధారి విదురునితో వచ్చి సభలో జరిగినిది సర్వమూ చెప్పడమూ జరిగింది, ధృతరాష్ట్రుడు ద్రౌపదిని పిలిచి రెండు వారాలివ్వడమూ జరిగింది, ఆమె అడగకపోయినా. ఆ తరవాత ధృతరాష్ట్రుడు ధర్మరాజును, తమ్ములందరితోనూ దగ్గరకు పిలిచి ఇలా అన్నాడు. 

మహాభారతం, కవిత్రయ ప్రణీతం, సభాపర్వం,ద్వితీయాశ్వాసం 264నుండి 267 వరకు.

“అనిన ధృతరాష్ట్రుండు కోడలిగుణంబుకు ధర్మంబెరుగుటకు సంతసిల్లి యనుజ సహితంబుగా యుధిష్ఠరు రావించి నీవు సర్వసంపదలు స్వరాజ్యంబును నొప్పుగొని యెప్పటియట్ల యింద్రప్రస్థపురంబున కరిగి సుఖంబుండుము నీకు లగ్గయ్యెడు మని వెండియు…….264

నీవు నిత్యము వృద్ధోపసేవజేసి యెరుగు దెల్లధర్మంబుల నెరుక లేక

కడగి నీ కెగ్గు సేసె నాకొడుకు దీని మఱచునది నీకు నొండ్లు గఱపనేల…265

మనమున వేరమి దలపమియును సక్షమచిత్తుడగుటయును గుణంబులుకై

కొని దోషంబులు విడుచుటయును నుత్తముడయిన పురుషునుత్తమగుణముల్….266

యేను బుద్ధిలేక జూదంబుపేక్షించితి. నల్పబుద్ధిసత్వుం డయిన నన్నును మీతల్లి యయిన గాంధారినిం దలచి,దుర్యోధనాదులు సేసినదుర్నయంబులు సేకొనకుండునది. సర్వశాస్త్ర విదుండయిన విదురుండు మంత్రిగా సర్వధర్మవిదుండవైన నీవు రక్షకుండువుగా నిక్కురుకులంబునకు లగ్గగునని ధర్మరాజు బాండురాజు రాజ్యంబునందు సమర్పించిన…267″

//నీ సంపదలు,స్వరాజ్యం తీసుకుని ఇంద్రప్రస్థం వెళ్ళి సుఖంగా ఉండు, నీకు మంచి జరుగుతుంది.నీవు పెద్దవాళ్ళని సేవించడం మూలంగా ధర్మాలన్నీ తెలుసు, నాకొడుకు ధర్మం తెలియక నీకు కీడు చేసేడు, దీన్ని మరచిపో! అన్నీ తెలిసినవాడివి నీకు మరొకరు చెప్పాలా! మనసులో వేరుగా తలపకపోవడం, క్షమాచిత్తం కలిగి ఉండడం, మంచిని తీసుకుని చెడును వదలిపెట్టడం ఉత్తములైనవారి ఉత్తమగుణాలు.

నేను బుద్ధిలేక జూదాన్ని తేలికగా, అశ్రద్ధగా,తీసుకున్నాను. నిర్లక్ష్యం చేశాను.  అల్పబుద్ధి కలిగిన నన్నూ మీతల్లి గాంధారిని తలచి, దుర్యోధనాదులు చేసిన చెడ్డపనులు మనసుకు తీసుకోకు. సర్వశాస్రాలూ తెలిసిన విదురుడు మంత్రిగా నీవు రక్షకుడవుగా ఉంటే ఈ కురుకులానికి మంచి జరుగుతుందని చెప్పి ధర్మరాజుకు పాండురాజు రాజ్యం సమర్పించాడు. //

నాకు బుద్ధిలేకపోయిందయ్యా! నాకు బుద్ధి లేకపోయి జూదాన్ని తేలికగా తీసుకుని నిర్లక్ష్యం చేశాను. స్వార్ధబుద్ధి కల నన్నూ మీ తల్లి గాంధారి ముఖాలు చూసి నాకొడుకు వాని అనుచరులు మీ పట్ల చేసిన చెడ్డపనులు మరిచిపో, క్షమించు. 

శర్మ కాలక్షేపంకబుర్లు-ధృతరాష్ట్రుడు ద్రౌపదికి వరాలెందుకిచ్చాడు?

ధృతరాష్ట్రుడు ద్రౌపదికి వరాలెందుకిచ్చాడు?

ఆంధ్ర మహాభారతం కవిత్రయ ప్రణీతం సభాపర్వం,ద్వితీయాశ్వాసం 172 నుండి 264వరకు స్వేఛ్ఛానువాదం

ధర్మరాజు, శకునిల మధ్య జూదం మొదలైంది. ధర్మరాజు పావులు ముట్టుకోకనే,సంపదలు,రాజ్యమూ ఓడిపోయాడు, ఆ తరవాత తనను పందెంలో ఒడ్డి ఓడిపోయాడు, తమ్ములతో సహా!అప్పుడు శకుని నువ్వు ఇంకా ఆడచ్చు, ద్రౌపదిని పందెంగా పెట్టచ్చు అన్నాడు. ధర్మరాజు ద్రౌపదిని పందెంఒడ్డి ఓడిపోయాడు. ఆ తరవాత దుర్యోధనుడు విదురుని పిలిచి ద్రౌపదిని సభకు తీసుకురమ్మన్నాడు. నీకు ఉచితానుచితాలు తెలియటం లేదు, ఎవరికి ఏ పని చెప్పచ్చో చెప్పకూడదో తెలియకవున్నావని అనడం తో ద్రౌపదిని సభకు తీసుకురమ్మని ప్రాతికామికి చెప్పేడు. 

ప్రాతికామి ద్రౌపది దగ్గరకుపోయి సభలో జరిగినది చెప్పి, ఆమెను సభకు రమ్మన్నాడు. విన్న ద్రౌపది,తన్నోడి నన్నోడెనా? నన్నోడి తన్నోడెనా? ధర్మరాజునే కనుక్కురమ్మంది. అదేమాట సభలో చెప్పాడు ప్రాతికామి. అనుమానం సభలోనె తీరుస్తారు తీసుకురమ్మని చెప్పాడు, దుర్యోధనుడు. ఆమాటే వెళ్ళి ద్రౌపదికి చెప్పాడు, ప్రాతికామి.  ద్రౌపది ప్రాతికామి వెనక బయలుదేరి సభలో కురువృద్ధుల చెంతకు చేరింది.  ప్రాతికామి భీమునికి భయపడుతున్నాడు, నీవుపోయి  ద్రౌపదిని సభకు, తీసుకురమ్మని దుశ్శాసనునికి చెప్పాడు, దుర్యోధనుడు

దుశ్శాసనుడు తనకోసం బయలుదేరుతున్న సంగతి తెలుసుకున్న ద్రౌపది సభలో ఉన్న గాంధారి దగ్గరకు పరుగెత్తింది.ఎక్కడిదాకా పరుగెట్టిపోతావు?  నిన్ను పట్టకమాననని,  దుశ్శాసనుడు అటువస్తుంటే పట్టపురాణి గాంధారి దగ్గరకి పరుగుపెట్టింది. దుశ్శాసనుడు గాంధారి దగ్గరున్న ద్రౌపదిని పట్టబోతుంటే నన్ను ముట్టకు,రజస్వలను, ఏకవస్త్రను అని చెప్పింది. దుశ్శాసనుడు పట్టపురాణి సమక్షంలో నీవు ఏకవస్త్రవైనా, వివస్త్రవైనా సభకు తీసుకెళతానని, ద్రౌపదిని కొప్పుపట్టి సభలోకి ఈడ్చుకొచ్చాడు, అప్పుడు కృష్ణుని తలచింది,ద్రౌపది. అంతట వికర్ణుడు ద్రౌపది ప్రశ్నకు సమాధానం చెప్పాలి అన్నాడు. ఎవరూ బదులు చెప్పలేదు.ఐతే నేను ధర్మ నిర్ణయం చెబుతున్నా! ఆమె అధర్మ విజిత,అంతేకాదు ఏకవస్త్రను సభకు ఈడ్చుకురావడం అన్యాయం అన్నాడు. దానికి కర్ణుడు కుర్రవాడివి, కురు వృద్ధులు, గురువులు ఉన్నచోట ఇలా పలకడం కూడదు. ఒక స్త్రీకి ఒకడు భర్త,ఈమెకు అనేకులు భర్తలు, ఈమెను బంధకి అంటారు, అందుచేత ఈమె ఏకవస్త్రగా గాని,వివస్త్రగాగాని సభకు తీసుకురావచ్చు,ధర్మం తప్పదు, అన్నాడు.కర్ణుని మాటపై దుర్యోధనుడు, పాండవుల,ద్రౌపది వస్త్రాలు ఊడతీయమన్నాడు. 

దుశ్శాసనుడు ద్రౌపది వస్త్రం లాగుతుంటే అది అశేషమై వస్త్రాలు గుట్టగా పడ్డాయి,కాని ద్రౌపది ఒంటిపై బట్ట తొలగలేదు. అది చూచి దుశ్శాసనుడు సిగ్గుపడ్డాడు. ఇది చూచి భీముడు దుశ్శాసనుని రొమ్ము చీల్చి రక్తం తాగుతానని శపధం చేశాడు. సభలోనివారంతా ధృతరాష్ట్రుని కౌరవులను నిందించారు, ముసలిరాజులంతా పట్టించుకోలేదనీ తిట్టారు. అప్పుడు విదురుడు కలగేసుకుని సభకి ఇలాచెప్పాడు.వికర్ణుడు ధర్మబుద్ధితో చెప్పేడు. సభలో ధర్మసందేహం తీర్చకపోతే అబద్ధం ఆడిన ఫలితం పొందుతారు, అందుచే ధర్మం చెప్పి తీరాలన్నాడు. అప్పుడు ద్రౌపది పాండవుల పత్నిని, గోవిందుని చెల్లిని,నేడు వీనిచే సభామధ్యంలో, నరపతులు, కురువృద్ధులు,గురువృద్ధులు ఉండగా,  నన్నిలా చేయడం తగునా, నా మాటలకెవరూ సమాధానం చెప్పరే! నే దాసినా? నే దాసినా? అని అరిచింది.దానికి భీష్ముడు అమ్మా! నీ ప్రశ్న ధర్మ సూక్ష్మం, ధర్మరాజే సమధానం చెప్పగలడు, వీరి చర్యలఫలితం తొందరలోనే వీళ్ళు అనుభవిస్తారన్నాడు.

ఆ తదుపరి కర్ణుడు జూదంలో నిన్ను పణంగా పెట్టి ఓడిపోని ఒక్కణ్ణి కట్టుకో, పనికిరానివాళ్ళు ఎంతమంది ఉన్నా మేలులేదు, అని ఎకసక్కెమాడేడు.అంతట దుర్యోధనుడు తొడ చూపాడు.రవిలిపోయిన మనసుతో భీముడు తొడలు విరిచి చంపుతానని ప్రతిన చేశాడు. ఇది విన్న భీష్మ ద్రోణులు, కోపానికి ఇది తగు సమయం కాదన్నారు.అంతా ఎరిగిన గాంధారి విదురుని తీసుకుని ధృతరాష్ట్రుని దగ్గరకిపోయి, సభలో జరిగినదంతా భర్తకు తెలిపింది, దుర్నిమిత్తాలు కనపడుతున్నాయని కూడా చెప్పింది. 

విన్న ధృతరాష్రుడు దుర్యోధనుని పిలిపించి పాండవులభార్య గౌరవనీయురాలిపట్ల తప్పు మాటలు మాట్లాడం తగదు, చిన్నప్పటినుంచి నీ దుష్ట స్వభావం మాన్చుకోలేదు, నీ మూలంగా పాండవులకు దుఃఖం కలిగిందని, వారిపట్ల దురాగ్రహం పనికిరాదు, అని తిట్టాడు. అందరికి మంచి చేయాలని తలచి ద్రౌపదిని పిలిపించి

’నా కోడళ్ళంద’రిలోనూ ఎన్నదగినదానివి, అయోనిజవు, నీకు వరమివ్వాలనుకుంటున్నాను, కోరుకోమన్నాడు. దానికి ద్రౌపది ధర్మరాజును దాస్య విముక్తుని చేయమని, కారణం చెప్పింది,ధర్మరాజు తనయుడు దాసపుత్రుడనే పేరు లేకుందుకే అని చెప్పింది. మరో వరం కోరమన్నాడు. మిగిలిన పాండవులను అస్త్ర శస్త్రాలతో దాస్య విముక్తి చేయమంది. తధాస్తు అంటూ, మరో వరం కోరుకోమన్నాడు. 

నేను క్షత్రియ కాంతను, నేను రెండు వరాలు కోరడానికే అర్హురాలను, అని మూడో వరం సున్నితంగా తిరస్కరించింది. . ధృతరాష్రుడు ఆమెను మెచ్చి పాండవులను పిలిపించాడు. ధర్మరాజా! నీ సర్వసంపదలతో, నీ స్వరాజ్యాన్ని ఎప్పటిలా ఏలుకో,ఇంద్రప్రస్థం పోయి సుఖంగా ఉండమన్నాడు.

ద్రౌపది వరాలు కోరలేదు, ఆమెను పిలిపించి ధృతరాష్ట్రుడు వరాలెందుకిచ్చాడు? మెదడుకి పదును పెట్టండి….

శర్మ కాలక్షేపంకబుర్లు- కైక రాముని వనవాసం పదునాలుగేళ్ళే ఎందుకడిగింది?

కైక రాముని వనవాసం పద్నాలుగేళ్ళే ఎందుకడిగింది?

ఈ ప్రశ్న ఎక్కడో చదివాను, సమాధానం చదవలేకపోయా! నాకు తోచిన సమాధానం ఇదీ!!!

ఈ ప్రశ్నలోకి వెళ్ళే ముందు ఆస్థులు,అనుభవహక్కులు,వాటి కాల దోషం గురించి కొద్దిగా ముచ్చటిద్దాం.

ప్రామిసరీనోటు కాలం మూడేళ్ళు, ఆ లోగా చెల్లు వేయడంగాని,తిరగరాయడంగాని, కొంత జమకట్టడం గాని జరగాలి. మూడేళ్ళు దాటిన మరునాడు ఆ నోటు చెల్లదు. నోటు చచ్చిపోయిందంటారు, దానినే కాలదోషం పట్టిందనడం, ఇంగ్లీష్ లో చెప్పాలంటే టైమ్ లాప్సు అయింది. ఇలాగే అస్థులగురించి కూడా!అనుభవహక్కులు,వాటి కాలపరిమితి వగైరాలు ఉన్నాయి. ఇవి ఏదో ఒకరోజులో వచ్చినవికావు. వేల సంవత్సరాలుగా కాలంతో పాటు మార్పులు చెందుతూ వచ్చినవి, నేటి కాలానికి నోటు మూడేళ్ళకి కాలదోషం, ఏదేని ఆస్థిపై హక్కు నిరూపించుకునే పన్ను కట్టడం, అద్దెతీసుకోవడం, ఇటువంటివి పన్నెండు సంవత్సరాలు కనక యజమాని చేయక ఆస్థిని వదిలేస్తే, ఆ అస్థి అనుభవిస్తున్నవారి సొత్తవుతుంది. ఇప్పటికిన్నీ స్వాధీన తణఖా సమయం పన్నెండేళ్ళని నా ఎరుక. అదేగనక ప్రభుత్వ ఆస్థిని ఇరవై సంవత్సరాలు నిరాటంగా ఆక్రమించుకుని ఉంటే అది అనుభవదారుని స్వంతం ఔతుంది. ఇలా చాలా ఉన్నాయి, నేటి కాలానికి. ఇక ఇప్పుడు ప్రశ్నలోకి వెళదాం.

కైక రెండు వరాలు దశరథుని అడిగింది. అందులో ఒకటి రాముడు పదునాలుగేళ్ళు వనవాసం చెయ్యాలి. పదునాలుగేళ్ళే ఎందుకడిగింది? ఎక్కువో తక్కువో అడగచ్చుకదా?

రామాయణం ఎప్పుడు జరిందంటే నిర్దిష్టమైన సమయం చెప్పడం కష్టం. ఆనాటికి నిలిచి ఉన్న ఆస్థి పై హక్కు కోల్పోడానికి సమయం పదునాలుగేళ్ళు. ఇది దృష్టిలో ఉంచుకునే రాముని వనవాసకాలం పదునాలుగేళ్ళుగా కైక అడిగింది. అంటే పద్నాలుగేళ్ళు వనవాసం తరవాత రాముడు మరల రాజ్యాన్ని స్వాధీనం చేసుకోలేడు, కాల దోషం పట్టింది కనక.

దశరథుడు మరణించాడు, రాముడు వనవాసంకి వెళ్ళిన తదుపరి. భరతునికి కబురంపేరు, మేనమామ ఇంట ఉంటే. వచ్చి విషయం తెలుసుకున్న భరతుడు అన్నదగ్గరకు పోయి రాజ్యం నీదే ఏలుకోమని కోరాడు. రాముడు ఒప్పుకోలేదు,పదునాలుగేళ్ళ తరవాత తిరిగివస్తానన్నాడు, ఎంత చెప్పినా. చివరికి రాముని పాదుకలు పుచ్చుకుని వచ్చి, వాటికి పట్టాభిషేకం జరిపించాడు, భరతుడు.

పదునాలుగేళ్ళ వనవాసం తరవాత వస్తాను, రాజ్యం ఏలుకుంటానని చెప్పినా. భరతుడు ఇలా ఎందుకు చేశాడు?

రాముని దగ్గరకు తిరిగి రమ్మని చెప్పడానికి కొంతమందే వెళ్ళేరు, ఇక్కడ ఏమి జరిగినదీ ప్రజలకి తెలియదు. పాదుకలు తెచ్చి వాటికి పట్టం కట్టకపోతే, పదునాలుగేళ్ళ తరవాత రాముడు కనక రాజ్యం తీసుకుంటే, రాముడు భరతుని రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడని ప్రజలనుకోవచ్చు. అందుకే పాదుకా పట్టాభిషేకం, ప్రజలకి రాజ్యం రామునిదే అని చెప్పడానికి భరతుడు చేసినది. అలా అనుకోకుండడానికే భరతుడు పాదుకలు తెచ్చి పట్టం కట్టడమే కాక అయోధ్యలో కాక నంది గ్రామంలో ఉండి రాజ్య పాలన చేశాడు. భరతుడు రామునితో నీవు గనక పదునాలుగేళ్ళు దాటిన మరునాటికి అయోధ్యకి రాకపోతే నేను సన్యసిస్తానని చెబుతాడు. అందుకే రాముడు సమయానికి రాలేక హనుమతో వస్తున్న కబురు ముందుగాపంపినది.

మరొక సంగతి కూడా చర్చకు రావచ్చు అది భారతంలో పన్నెండేళ్ళ వనవాసం, ఒక సంవత్సరం అజ్ఞాతవాసం. ఇది పందెం.ఎలాగైనా ఉండచ్చు. కాని ఇందులో కూడా పదమూడేళ్ళు అన్నది ఆ కాలంనాటి కాలదోష సమయం అనుకుంటున్నా.ఇవి వేల సంవత్సరాలలో ఆస్థి, అనుభవ హక్కుల్లో వచ్చిన తేడాలు.రామయణ కాలానికి కాలదోష సమయం పదునాలుగేళ్ళు, భారత కాలం నాటికి అది పదమూడేళ్ళయింది. నేటికి కాలదోష సమయం పన్నెండేళ్ళని చెప్పుకున్నాంగా. కాలదోష సమయం ఇలా తగ్గుతూ వచ్చింది.

శర్మ కాలక్షేపంకబుర్లు-భూమి గుండ్రముగానున్నది.

భూమి గుండరంగానే ఉందయ్యా! మాకు చాలా కాలం నుంచే తెలుసు.

బల్లపరుపుగా లేదంటారా? చిత్తం కాని నేటికీ బల్లపరుపుగా ఉందనే సంఘాలు పశ్చిమదేశాల్లో ఉన్నాయష.

దానికేంగాని, పూర్వం భారతదేశంలో వేశ్యలు ఉండేవారు.వారికి సమాజంలో గౌరవమూ ఉండేది,వారు సర్వతంత్ర స్వతంత్రులు కూడా. ఎవరితో లైంగిక సంబంధం ఉంచుకోవడం , తెంచుకోవడం వారిష్టం, బలవంతం లేదు. వారు కొన్ని చోట్ల ప్రభుత్వాలలో కూడా ఉన్నట్టు చరిత్ర చెబుతోంది. వేశ్యా జీవితాన్ని ఒక వృత్తిగా నాటి సమాజం గుర్తించింది. ఒకే ఇంట్లో ఒకరు వేశ్యగా ఉంటే మరొకరు సంసారిగా ఉన్న సంఘటనలూ ఉన్నాయి. మనకు స్వతంత్రం వచ్చిన తరవాత వేశ్యావృత్తి అనేది నీచం అని ఒక చట్టం చేసి నిషేధించారు. ఆ కాలానికి వేశ్యల ఇళ్ళు తెలిసి ఉండేవి, వీరిని భోగ స్త్రిలనీ పిలిచేవారు. . భోగం మేళాలనీ ఉండేవి. వీటినీ నిషేధించారు. బాగు! బాగు!! ఏంజరిగిందీ? ప్రభుత్వంలో ఉన్నవారి అంతేవాసులు వేశ్యలను పోగుచేసి, కొందరిని బలవంతంగా ఆ వృత్తిలోకి దింపి కంపెనీలు మొదలెట్టేరు. ఒక స్త్రీ పరపురుషునితో లైంగిక సంబంధం పెట్టుకుంటే పోలీసులు కేస్ రాసి కోర్టుకి తీసుకుపోయేవారు. అంతేవాసుల కంపెనీల మీద దాడి చేస్తే వూరుకుంటారా? పోలీసులకి ఆదాయ వనరు ఏర్పడింది.మామూళ్ళతో కాలం గడిచింది, ఒక్క పోలీస్ కేనా ఆదాయం, మరి ప్రభుత్వాలలో పెద్దలకీ చేరింది, సొమ్ము.

కాలం గడచింది, వేశ్యలకీ సహనం నశించింది, కోర్టు గడప తొక్కేరు. చివరికి కేసు సుప్రీం కోర్టుకు చేరింది. ఈ మధ్యనే ఒక తీర్పిస్తూ సుప్రీం కోర్ట్ ఇలా చెప్పింది.

మేజర్లయిన స్త్రీ పురుషులు ఇష్టపూర్వకంగా లైంగిక సంబంధం పెట్టుకోవడంలో పోలీస్ జోక్యం అనవసరం. వేశ్యగా జీవించడం ఒక వృత్తి. ఐతే బలవంతంగా వేశ్యా వృత్తి చేయించడం నేరం. వేశ్యా గృహాలు నడపడం నేరం.

చక్రం తిరిగి కిందకొచ్చింది. భూమి గుండ్రముగా ఉన్నది.

చెప్పుకుంటే చాలా ఉన్నాయి మరో ముచ్చట మరో సారి.

శర్మ కాలక్షేపంకబుర్లు-నైజగుణానికి లొట్టకంటికి మందు లేదు.

నైజగుణమంటే సహజగుణం లేదా పుట్టుకతో వచ్చిన బుద్ధి. లొట్టకన్నంటే గుడ్డికన్ను, ఇదీ పుట్టుకతో వచ్చిందే! ఈ రెండిటికీ మందువల్ల మార్పురాదన్నదే,బాగుపడవన్నదే నానుడిలో చెప్పినమాట. దీనిని మరోలా కూడా చెబుతారు, “పుఱ్ఱెతో పుట్టిన బుద్ధి పుడకలతోకాని పోదని” అంటే మార్పురాదూ అని రూఢంగా చెప్పిన మాట. 🙂

వేపవిత్తును తెచ్చి పంచదారనీళ్ళలో నానబెట్టి మొలకెత్తించి, పంచదారనీళ్ళు పోసి పెంచినా, చెట్టు వేపకాయలే కాస్తుంది, మామిడి కాయలు కాయదు, కాసిన వేపకాయలు చేదుగానే ఉంటాయి.. ఇది సహజం.

పామును పిల్లగా తెచ్చి లేదా గుడ్డును తెచ్చి పిల్లప్పటినుంచి పాలుపోసి పెంచినా అది విషమే కక్కుతుంది,ఎన్నడూ అమృత చిమ్మదు, పెంచిన చేతిని కాటు వేస్తుంది, తన అవసరం బట్టి.

సింహం ముసలిదైనా,వేటాడటానికి కోరలు గోళ్ళు లేకపోయినా, రోగపీడతయైనా, ఆహారం లేక చచ్చిపోతుందిగాని ఎండుగడ్డి తింటుందా?ఇది లక్ష్మణ కవి ప్రశ్న. తినదు, ఆహారం సంపాదించుకోలేకపోతే చనిపోతుంది తప్ప గడ్డి తినదు,తినలేదు. అది అశోకుని సింహమైనా,గాంధీగారి సింహమైనా కోరలు గోళ్ళు ఉంటాయి.గాంధీగారి సింహం గడ్డి తింటుందంటే నమ్మాల్సిందేనా? జూ లో పెంచే సింహానికైనా మాంసమే ఆహారం, గడ్డి కాదు 🙂 సింహం తన సహజగుణం వదులుకోదు, వదులుకోలేదు.

ఎంత చదువుచదివి ఎన్ని నేర్చినగాని
హీనుడవ గుణంబు మానలేడు
బొగ్గు పాలగడుగ పోవునా మలినంబు?
విశ్వదాభిరామ వినురవేమ.
తాతగారి మాట, ఏంతచదివినా,ఎన్ని అర్హతలు సంపాదించినా, గొప్ప పదవులు నిర్వహించినా హీనుడు (నీచ ఆలోచనా పరుడు) తన స్వగుణం (నైజ గుణం )మార్చుకోలేడు,ఉదాహరణ చెప్పేరు తాతగారు,బోధపడ్డానికి, బొగ్గు నల్లగా ఉంటుంది, ముట్టుకుంటే నలుపు చేతిని అంటుతుంది కూడా, ఇటువంటి బొగ్గును తెచ్చి తెల్లనైన పాలలో నానబెట్టి ఉంచి, ఎన్ని సార్లు కడిగినా, తన సహజగుణం నలుపును వదులుకోలేదు. హీనుడూ అంతే! కామ,క్రోధ,మోహ,లోభ,మద,మాత్సర్యాలు అరిషడ్వర్గాలన్నారు పెద్దలు. ఇందులో చిట్టచివరిది మాత్సర్యం,(ఈర్ష్య) ఈ మాత్సర్యంకి చిలవలు పలవలే,అసూయ,ద్వేషం. నిజాన్ని కూడా చూడలేకపోవడం ద్వేషానికి పరాకాష్ట.

సహజగుణాలని మార్చేస్తాం, అందరిని సమానం చేసేస్తాం అన్నది ఉత్తి మాట.

శర్మ కాలక్షేపంకబుర్లు-కర్ణుడు-అంగరాజ పట్టాభిషేకం.-1

కురుకుమారుల అస్త్రవిద్యా ప్రదర్శనలో భీమ,దుర్యోధనులు గదాయుద్ధంలో తలపడ్డారు. ప్రదర్శన శ్రుతి మించుతోంటే, ద్రోణుడు కృపుని పంపి ఆపుచేయించారు. దుర్యోధనుడు ఉడికిపోయాడు, తనది పైచేయి కాలేదని. ఈ లోగా అర్జునుని అస్త్ర ప్రదర్శన, ప్రజల చప్పట్లు దుర్యోధనునికి పుండు మీద కారం చల్లినట్లనిపించింది. ఈ లోగా కర్ణుని రాక, అర్జుని ఎదిరించడం ఎడారిలో మలయమారుతమే అయింది, దుర్యోధనునికి. అర్జునిని ధిక్కరించిన అస్త్ర ప్రదర్శన ఆనందమే అయింది, కాని కర్ణుడు, అర్జునినితో తలపడ్డాన్ని కృపుడు ఆపుచేయడంతో దుర్యోధనుని మనసు మళ్ళీ కలకబారింది. కర్ణుడు రాజయితే, అర్జునిని ఎదిరించవచ్చనే ఆలోచన అప్పటికప్పుడు దుర్యోధనుని మదిలో పుట్టి పెరిగింది. కర్ణుని అంగరాజుగా చేయాలనే తలంపు బలంగా కలిగింది, సాధించుకోడానికి తండ్రి దగ్గరకుపోలేదు, తిన్నగా భీష్ముని దగ్గరకే చేరాడు, ఎందుకంటే అప్పటికి ధృతరాష్ట్రుడు భీష్మ,విదురుల మంత్రాంగంలో రాజ్యం నడుపుతున్నాడు. కర్ణుని అంగరాజుగా చేయాలనుకుంటున్నా అన్నదానికి భీష్ముడు తలవూపారు. భీష్ముడు కర్ణుని అంగరాజుగా నియమించడాన్ని ఎందుకు ఒప్పుకున్నట్టు? భీష్మునికి కురురాజ్య క్షేమం,కురు వంశాభివృద్ది ముఖ్యం. కురు రాజ్యంలో నాటి కాలాని రాబోయే తరంలో అర్జునుడు సాటి, మేటి విలుకాడు, మరొకడు లేదు. మరొకడు కూడా అంతటివాడు రాజ్యంలో ఉండడం మంచిదే! అటువంటివాడిని వదలుకోవడం రాజ్యానికి మంచిది కాదనే ఆలోచనతో ఒప్పుకున్నాడు. విషయం ద్రోణునికి చేరింది. ఆయన ఆలోచనేమి? కర్ణుడు కూడా తన శిష్యుడే, అర్జునుడంతవాడో కాకపొయినా , తన శిష్యునికే రాజ్య పదవి కట్టబెడుతోంటే ఆనందంతో తలూపాడు. ఇక విదురుడు,ఈయనకు దుర్యోధనుని దురాలోచన తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండిపోయాడు. తను అడ్డగించినా కార్యం ఆగదనే విషయం గుర్తించి,బయట పడకపోవడమే మేలని మిన్నకున్నాడు. అప్పటికి దుర్యోధనుడు పాండవులపట్ల చేసిన దురాగతాలు తెలిసినవాడు కనక. అవి భీమునికి విషాన్నం పెట్టడం,గంగలో తోయించడం. వీటిని పెద్దల దాకా చేరకుండా అడ్డుకున్నది కుంతి.

ఇప్పుడు భీష్మ,ద్రోణ,విదురుల ఆలోచనతో తండ్రి దగ్గరకుపోయి కర్ణుని అంగరాజుగా నియమించమని కోరాడు, జరిగిన విషయం తెలుసుకున్న ధృతరాష్రుడు నియామకం చేసాడు.

శర్మ కాలక్షేపంకబుర్లు-అతి…

అతి…

గత నాలుగు నెలలుగా ఎండలు పేల్చేస్తున్నాయి. మొన్న జూన్ 21 ఉదయం వర్షంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. వర్షం రోజు కురుస్తూనే ఉంది, పదిహేను రోజులుగా. నాలుగు రోజుల కితం ఉదయం కాలేజి వాకింగ్ ట్రేక్ మీద నడుస్తుంటే వర్షం పట్టుకుంది, ఒక్క సారిగా అందరం పక్క స్కూల్ గదిలోకి చేరేం. కొద్ది సేపు నిశ్శబ్దం రాజ్యం చేసింది.

ఒక పెద్దాయన వాతావరణం ఒక్క సారి మారిపోయిందీ అన్నారు, జానాంతికంగా.

ఒక యువకుడు వర్షకాలం కదా!మార్పు సహజం అన్నాడు.

మార్పు నెమ్మదిగా వచ్చేది అదేంటో ఈ సంవత్సరం మార్పు ఒక్క సారి వచ్చిందే అన్నది, కొద్దిగా చలి కూడా ఉంది, మరో మధ్య వయస్కుని మాట.

ఆరోగ్యాలు జాగ్రత్త హెచ్చరించారొక పెద్దాయన.

ఈ మధ్య వాకింగ్ లో అందరూ తడుస్తున్నారు, రైన్ కోట్లు వేసుకురండని చెప్పినా వినరు, విసుక్కుందో వృద్ధ మహిళ.

గ్రహచారం ఎలా ఉందో అన్నది మరో పెద్దాయన మాట.

గ్రహాలన్నీ మాలికా యోగంలో ఉన్నాయన్నారు, మరొకరు.

అదేంటో అన్నది ఒక యువకుని ప్రశ్న.

ఇటువంటివి చెప్పి ప్రజల్ని భయపెట్టడం అన్నది మరో యువకుని మాట.

విషయం వినరాదా అన్నారు మరో విజ్ఞుడు

గ్రహాలన్ని వరసగా రాసుల్లో ఒక వైపు ఉండడాన్ని మాలికా యోగం అంటారన్నారు మరొకరు.

అలా గ్రహాలు వరసగా ఉండడం అన్నది కొత్త మాటేం కాదు, ఇటువవంటివి జరుగుతూనే ఉంటాయన్నది ఒక యువకుని మాట.

విషయమేంటో తెలుసుకోకుండా తీసిపారేస్తావేం అదిలించారు మరో పెద్దాయన.

మాలికా యోగాలు వస్తూనే ఉంటాయిగాని దీని ప్రత్యేకతేంటో చెబుదురూ అన్నాడు మరో యువకుడు.

ఇప్పుడున్న మాలికాయోగంలో గ్రహాలు వరుసగా తమ స్వస్థానాల్లో ఉండడమే ఆ ప్రత్యేక. ఎలాగంటే శనికి మకర,కుంభాలు స్వస్థానాలు. శని కుంభం లో ఉన్నారు. గురునికి ధనుర్మీనాలు స్వస్థానాలు, గురువు మీనంలో ఉన్నారు. ఆ తరవాత కుజుడు స్వస్థానాలు మేష,వృశ్చికాలు. కుజుడు మేషంలో ఉన్నాడు రాహువుతో కలిసి. శుక్రుని స్వస్థానం వృషభం, శుక్రుడు వృషభం లో ఉన్నాడు. మిథునం బుధుని స్వస్థానం, బుథుడు అక్కడే ఉన్నాడు, చంద్రుని స్వస్థానం కర్కాటకం, చంద్రుడు అక్కడే ఉన్నాడు. ఇలా గ్రహాలన్ని తమతమ స్వస్థానాల్లో వరసగా ఉండడమే ఇప్పటి మాలికా యోగం ప్రత్యేకత, అని విశదీకరించారు, మరొకరు.

దీని విశేషం ఏమో చెప్పండీ అన్నారంతా ఏక కంఠం తో…..

ప్రతీ విషయం అతి చెయ్యడమే ఈ గ్రహమాలికా ఫలితం అని తువ్వాలు దులుపుకుని పైనేసుకుని చకచకా వెళ్ళిపోయారా పెద్దాయన, కర్ర పట్టుకుని…..

శర్మ కాలక్షేపంకబుర్లు-కర్ణుడు-అంగరాజ పట్టాభిషేకం.

కర్ణుడు-అంగరాజ పట్టాభిషేకం.


కుమారస్త్ర విద్యా ప్రదర్శనలో అర్జునునితో తలపడ్డానికి సిద్ధమయ్యాడు, కర్ణుడు. తగదని వారించారు కృపుడు. కారణమడిగాడు దుర్యోధనుడు. రాజుకాని వాడు రాజుతో తలపడడానికి లేదని చెప్పేరు, కృపుడు. ఐతే కర్ణుని రాజుగా ( అనగా పరిపాలకునిగా) ప్రకటిస్తున్నానని చెప్పి అంగరాజ్యానికి పట్టాభిషేకం చేసాడు. ఈ సంఘటన గురించి రకరకాల వ్యాఖ్యానాలున్నాయి.

తనకే రాజ్యార్హత లేదు అంగరాజ్యానికి కర్ణుని ఎలాపట్టాభిషేకం చేసాడు? మరికొందరు, దుర్యోధనునికి ఆ హక్కు వున్నది పట్టాభిషేకం చేయచ్చు. ఇలా రకరకాల మాటలున్నాయి. కాని భారతం లో ఏమున్నది?

దుర్యోధనుడు కర్ణుని అంగ రాజ్యానికి పట్టాభిషేకం చేయాలని నిర్ణయించుకుని, విషయం భీష్మునికి చెప్పేడు,ద్రోణునికి,విదు రు నికి తెలిసింది. ధృతరాష్ట్రుడు ఒప్పుకున్నాడు. అప్పుడు కర్ణునికి అంగరాజ్యం పట్టాభిషేకం చేశాడు దుర్యోధనుడు. అసలు పట్టాభీషేకం అంటే ఒక సర్వతంత్ర స్వతంత్ర్య రాజ్యం ఇచ్చేయలేదు. ఇది కురు సామ్రాజ్యంలోని ఒక పరగణా లేదా ఒక చిన్న రాజ్యం. దీనికి పరిపాలకుడుగా నియామకం జరిగింది, అంతే!

శర్మ కాలక్షేపంకబుర్లు-పులిహోర ఆవకాయ.


పులిహోర ఆవకాయ.

రేడియో రోజుల్లో శ్రోతలు కోరిన పాటలు అనీ, సిలోన్ లో మన్ చాహేగీతనీ, ఇక బుధవారం రాత్రి ఎనిమిదికి అమీన్ సయానీ చేసేహడావుడి గుర్తుందా, బినాకా గీత్ మాలా అనీ ఆ తరవాత రోజుల్లో సిబాకా గీత్ మాలనీ, అదో ప్రపంచం. ఆ పాటలకి గ్రేడింగూ ఒకటో నంబర్ మీద వచ్చే పాటకి పెద్ద బిల్డప్పూ, ఇలోగా మిత్ర బృందం ఏ పాటొస్తుందో పందాలూ,ఆధా హై చంద్రమా రాత్ ఆధీ రహన జాయే తేరీ మేరీ బాత్ ఆధీ, ములాకాత్ ఆధీ 
आधा है चंद्रमा रात आधी रहनजायॆ तॆरी मॆरी बात आधी मुलाकात आधी…ఏంటి అర్ధమయిందా వయసులో 🙂 ఏదో మంచిపాటేలే నవర్ంగ్ లోది అని సరిపెట్టుకోడాలూ, ఇలా నేటి కాలానికి పాఠకులు కోరిన టపాలూ రాసేవాణ్ణి కాని మానేశాను, ఇదిగో మళ్ళీ వద్దనుకుంటూనే మొదలయింది. మొన్ననే ఒక టపా రాయనని, రాయలేనని మొహమాటం లేకుండా చెప్పడంతో,ఇప్పుడు మొహమాటం అడ్డొచ్చి ఈ టపా విన్నకోటవారి కోరికపై.


గోజిలలో ఆవకాయ పెట్టడంలో వైవిధ్యం ఎక్కువ. చెప్పుకోవాలంటే పులిహోర ఆవకాయ,పెసరావకాయ,శనగల ఆవకాయ, నూపిండి ఆవకాయ ఇలా ఎన్నో, ఎన్నో రకాలు. ఈ రకాల ఆవకాయలకి అన్నిటికి ఒక ప్రత్యేకత, ముక్కలు చిన్న చిన్నవిగా ఉండాలి. డొక్క ఉంటే సరి,లేకున్నా ఫరవాలేదు.. ఎంత చిన్నవైతే ముక్కలు, అంత మంచిది. ఈ ఆవకాయలు నిలవ ఉండేది తక్కువ. ఊరగాయల కాలంకి మూడు నాలుగు నెలల్లో అవకొట్టేయాలి, లేకపోతే బూజెక్కిపోతాయి.వీట్లో కొన్నిటిని ఎరుగుదును,కొన్నిటిని ఎరగను.
పెసరావకాయ,శనగల ఆవకాయ, నువు పిండి ఆవకాయ:- పెసరపిండి కారం,ఉప్పు సమానంగా తీసుకోవాలి నూనెతో గుచ్చెత్తాలి,చిన్నగా చేసుకున్నముక్కలు కలిపెయ్యాలి. పైన నూనెపోసుకోవాలి. కొందరైతే పెసలు కూడా పైన వేస్తారు. అవి నూనెలో,ఊటలో ఊరి బాగుంటాయి.ఆవ ఉండదు. శనగావకాయ కూడా ఇంతే, కాబూలీ శనగలని పెద్ద శనగలు వేస్తారు. నువు పిండి ఆవకాయ కూడా ఈ కోవలోదే.నువుపిండి,మెంతి,ఉప్పు ,కారం కలుపుతారు. ఇదో రుచీ.

పులిహోర ఆవకాయకి ముక్కలు చిన్నవిగా ఉంటాయి,మెంతి,కారం,ఉప్పు పోస్తారు, నూనెతో గుచ్చెత్తుతారు. ఆపై ఎండు మిర్చి ముక్కలు చేసుకుని, శనగపప్పు, మినపపప్పు, ఆవాలు, మెంతులు తో పోపు పెడతారు. కొందరైతే ఇంగువ కూడా వేస్తారు.ఇవన్నీ నూనెలో పుల్లటి ఊటలో నాని తింటుంతే ఆదో రుచి.

కొన్ని మరచిపోయానేమో కూడా సుమా.

శర్మ కాలక్షేపంకబుర్లు- రాముని అంతరంగం/విభీషణుని పట్టాభిషేకం.

రాముని అంతరంగం/విభీషణుని పట్టాభిషేకం.

శరణు వేడిన విభీషణునికి శరణు ఇవ్వాలా? వద్దా? రాముని కొలువులో చర్చ జరిగింది. చివరికి ”రావణుని కైనా అభయం ఇస్తాను, శరణు వేడితే” అని రాముడు అనడం తో చర్చ ముగిసింది, విభీషణుడు నేలకు దిగాడు.

”రావణునిబలం మరియు లంకా నగర విశేషాలు చెప్పమని” అడిగాడు,రాముడు. విభీషణుడు కొన్ని చెప్పాడు. వింటున్న రాముడు ”ఇవన్నీ ఇదివరకు విన్నవే” అని ”నీకు అభయం ఇస్తున్నాను, రావణ వధానంతరం నీకు లంకా రాజ్యం పట్టాభిషేకం చేస్తాను,నా ముగ్గురు తమ్ములపైన ఒట్టు”, అని చెప్పేడు. విన్న విభీషణుడు ”లంకానగర విజయ యాత్రలో సర్వ సాయం చేస్తాను” అని మాటిచ్చాడు. విన్న రాముడు మనసు మార్చుకొని లక్ష్మణునితో ”తమ్ముడూ, మన మిత్రుని లంకాధిపతిగా చూడాలని ఉంది, సముద్రజలాలు తెప్పించు” అన్నాడు. అంతే విభీషణునికి లంకా రాజ్యం పట్టాభిషేకం జరిగిపోయింది. రాముడు కొద్ది సేపటిలోనే ఎందుకు మనసు మార్చుకున్నాడు?

రాముని అంతరంగం
”లంక మాదికాదు, మా దాయాదులదీ కాదు. లంక మీద ఆధిపత్యం కావాలని తన వంశంలో వారెవరికి లేదు. అటువంటపుడు రావణ వధానంతరం లంకకి పట్టాభిషేకం చేస్తానననేల?
లంకా రాజ్యం పట్టాభిషేకం చేస్తానని వాగ్దానం మాత్రం చేస్తున్నాను, గెలవనని అనుమానమా? రావణ వధ తప్పదు, అటువంటప్పుడు పట్టాభిషేకం ఇప్పుడు చేయకపోవడం, విభీషణునికి మనసులో ఏమూలనో. ”వాగ్దానం చేసిన రాముడు నాకు లంక ఇస్తాడా?” అనే అనుమానంకి దారి చూపడం కదా. అందుకు ఇప్పుడే,ఈ క్షణమే లంకా రాజ్యనికి విభీషణుని పట్టాభిషేకం మంచిది” అని పట్టాభిషేకం జరిపించాడు.విభీషణుని మనసులో అనుమానమే మొలకెత్తకుండా జాగ్రత్త పడ్డాడు, అదీ రాజకీయ చతురత.

శర్మ కాలక్షేపంకబుర్లు-కారపు ఆవకాయ/కాయావకాయ

కారపు ఆవకాయ

దీన్నే కారపు ఆవకాయ అంటారు గోజిలలో. దీని పేరులో ఆవ ఉందిగాని దీనిలో ఆవ ఉండదు. అంచేత వేడి చేస్తుంది, అనారోగ్యం చేస్తుందనే మాట ఉత్తదే!

ఆవకాయ పెట్టుకోడానికి తగిన కాయేదీ? కొత్తపల్లి కొబ్బరి,చిన్నరసాలు ఇలా పీచు ఉన్నకాయ ఏదైనా ఆవకాయకి మంచిదే, పుల్లగా ఉంటే!   మాడుగుల ఆవాలు లేదా సన్నావాలు అంటారు, మహ ఘాటు, పెద్దావాలతో పెట్టుకుంటే కమ్మహా ఉంటుంది.  కారం, పచ్చావకాయకైతే గొల్లప్రోలు కాయలు, మామూలు ఆవకాయకైతే వరంగల్ కాయ బాగుంటుంది. వరంగల్ కాయైతే కారం కమ్మగా ఉంటుంది, గుంటూరు కాయ కంటే.వరంగల్ కాయ పెద్దదిగా ఉంటుంది, కొంచం దళసరిగా ఉంటుంది, కారం దిగుబడీ బాగుంటుంది. ఇక ఉప్పు, కళ్ళ ఉప్పు వాడుతారు, ఇందులో కూడా ఐయోడిన్ ఉంటుంది (ట). ఉప్పు ఎండబెట్టుకుని దంచుకుని అమ్మో బాధ పడలేమనుకుంటే పేకట్లో ఉప్పు వాడెయ్యచ్చు, చెమ్మ లేకుండటం ముఖ్యం.

ఇక మాగాయి పెట్టుకోడానికి తగిన కాయ పెద్దరసాలు,పంచదార కలసి, సువర్ణరేఖ ఇలా పుల్లగా ఉండేకాయ, పీచులేనట్టి కాయ, ఊట ఎక్కువగా వచ్చేకాయ ఏదైనా బాగానే ఉంటుంది.

కారపావకాయ పెట్టుకోడానికి కారం, ఉప్పూ గుచ్చెత్తుకోవాలి,కొద్దిగా పసుపేసుకోవాలి, కారమెంతో ఉప్పంత, భానుమతిగారి అత్తగారూ ఆవకాయ గుర్తొచ్చిందా? :). గానుగునూనె సిద్ధం చేసుకోవాలి, నువ్వులనూనె. మెంతులు సిద్ధం చేసుకోవాలి. కొంతమంది వేయించిన మెంతులు కలుపుతారు. పచ్చివి వేయడం శ్రేష్టం. ఇక ఊరగాయ పెట్టుకునే కాయ తెచ్చుకుని, నీటిలో వేసి శుభ్రంగా కడగాలి, తుడవాలి, తడిలేకుండా. ఈ కాయను నిలువుగా సగం పైగా చీరాలి, పూర్తిగా ముక్కలు చేసెయ్యకూడదు. కాయను వెనక్కి తిప్పాలి. ఇదివరలో చీరిన దానికి మరో వైపు మూడొంతులు చీరాలి. కాయ కాయలాగే ఉంటుంది,నాలుగు చెక్కలుగానూ ఉంటుంది. కాయలు ఇలా చేసుకున్న తరవాత తరిగిన కాయలో ఉన్న జీడి,పొర తీసెయ్యాలి. కారం,ఉప్పు గుచ్చెత్తిన దానిలో మెంతులు కలపాలి, నూనె పోసి ముద్దలా చెయ్యాలి. ఆ ముద్దను కొద్దికొద్దిగా కాయను కొద్దిగా విడదీసి కూరాలి, ముందునుంచి వెనకనుంచి. కాయల్ని అలాగే జాడీలో పెట్టేయాలి,మిగిలిన కారం పైన వేసేసి నూనెపోయాలి,తగు మాత్రంగా. మూడు రోజులకో సారి చూడాలి. ఉప్పు తక్కువైతే బూజుపట్టేస్తుంది, అది చూసుకోవాలి.

కాయావకాయ.

ఎలా చూసినా ఆవకాయకి వాడేవి ఐదు సరుకులే. అవి మామిడి కాయ,ఉప్పు, కారం, మెంతులు,ఆవాలు. వాటినే కొన్నిటిని కలిపి కొన్నిటిని వదిలేసి పెట్టే ఆవకాయలు రకరకాలు. ఈ కాయావకాయకు కూడా కాయల్ని పైన చెప్పినట్టు తరుక్కోవాలి. ఇప్పుడు మెంతుల్ని మెత్తగా చేసుకోవాలి. మెంతి పొడి కారం,ఉప్పూ సమానంగా తీసుకుని గుచ్చెత్తుకోవాలి. నూనిపోసి కలిపి ముద్ద చేయాలి. ముద్దను కొద్దికొద్దిగా కాయలలో కూరి భద్రపరచాలి, పైన నూనెపోయాలి. ఈ రెండు రకాల ఆవకాయలని వాడుకోడానికి మూడు నెలల సమయం కావాలి. ఈ కాయావకాయ ఆవ పడనివారికి, డయాబెటిస్ వారికి మంచిది. కాయావకాయ డయాబెటిస్ వారికి మందుగా కూడా పని చేస్తుంది.

దీన్నే కాయావకాయ,  డొక్కావకాయ అంటారు. కనీసం మూడు నెలలదాకా దీని ఉపయోగించలేము. అప్పటికి కాయలో పులుపు పిండికి చేరుతుంది. పిండిలో కారం పులుపు కాయకు చేరుతుంది. ఒక్క కాయ తీసుకుని ముక్క విడదీసుకుని వాడుకోవచ్చు. ఒక సారి తీసి సగం వాడిన కాయ మళ్ళీ అందులో పెట్టకండేం 🙂  కరోనా ఏం చేయలేదు. కరోనా ఉన్నా కతక్క తప్పదుగా

కాయను కాయలా తరుక్కోలేనివారు, ముక్కలు చేసుకోవచ్చు, ఏంచేస్తాం చెప్పండి.

శర్మ కాలక్షేపం కబుర్లు-ఇంటి గుట్టు లంక చేటని

ఇంటి గుట్టు లంక చేటని

శ్లో. ఆయుర్విత్తం గృహచ్ఛిద్రం, మంత్రమౌషధసంగమౌ ,
దానమానావమానాశ్చ, నవ గోప్యా మనీషిభిః.

గీ. ఆయువు, సిరి, గృహ చ్ఛిద్ర, యౌషధమును,
మానమును సంగమంబవమానము మరి
దానమును, మంత్రమును బృహద్జ్ఞానులెపుడు
తెలుప రాదంద్రు భువిపైన. తెలియుడయ్య.

భావము. ఆయువు , సంపద , గృహచ్ఛిద్రము , మంత్రము , ఔషధము , సంగమము , దానము , మానము , అవమానము – ఈ తొమ్మిదింటినీ బుద్ధిమంతులు రహస్యముగ నుంచవలెను

Coutesy:-Sri.Chinta Ramakrishna Rao gaaru. andhraamrutam blogspot.com


ఇంటి గుట్టు లంకచేటు అనేది సామెత. ఏది ఇంటి గుట్టు? ఇది రామాయణానికి సంబంధించిన సామెత.ఏంటో చూదాం.

రాముడు కపిసేనతో సముద్రపు ఒడ్డున విడిచి ఉన్నకాలం. సముద్రాన్ని ఎలా దాటాలా అని ఆలోచిస్తున్నకాలం. శరణు! శరణు!! అంటూ పరివారంతో ఆకాశంలో కనపడ్డాడో రాక్షసుడు. తన ప్రవరా చెప్పుకున్నాడు,దాచుకోకుండా, తాను విభీషణుడిననీ,రావణుని తమ్ముడిననీ.. చాలా తర్జనభర్జన తరవాత రాముడు చివరిగా రావణుని కైనా అభయమిస్తాను,శరణు వేడితే అనడంతో విభీషణుడు నేలకి దిగుతాడు. అప్పుడు జరిగిన సమావేశంలో లంక గుట్టు గురించి అడుగుతారు. విభీషణుడు చెబుతాడు, ఇంతలో ఒకరు ఇవన్నీ హనుమ చెప్పినవే,తెలిసినవీ, ఇవి కాక మరేమైనా చెప్పమంటారు. విభీషణుడు మౌనం వహిస్తాడు. ఇది చూసిన రాముడు, లక్ష్మణా మన మిత్రుని లంకాధిపతిగా చూడాలని ఉంది సముద్రజలాలు తెప్పించి అభిషేకించమంటాడు. ( అంత తొందరగా లంకాధిపతిగా విభీషణుని పట్టాభిషేకం ఎందుకు జరిపించాడు రాముడు, మరో టపాలో ) లక్ష్మణుడు విభీషణుని లంకాధిపతిగా పట్టాభిషేకం చేస్తాడు. ఇప్పుడు కూడా విభీషణుడేం చెప్పడు. అందరూ ఆ విషయం వదిలేస్తారు, రాముడు తరచి అడగకపోవడంతో.

యుద్ధం జరుగుతూ ఉంటుంది. విభీషణుడు ఎవరితోనూ యుద్ధం చెయ్యలేదు. రావణుని పరివారం అంతా మడసింది, మిగిలినవాడు మేఘనాథుడు ఒక్కడే, అతని మీదనే రావణుని ఆశమిగిలింది.ఇటువంటి సమయంలో మేఘనాథుడు నికుంభిలాదేవిని అర్చించడానికి బయలుదేరతాడు. ఈ వార్త తెలిసిన విభీషణుడు కంగారు పడతాడు, రాముని దగ్గరకు చేరి, ”రామా! మేఘనాథుడు నికుంభిలా దేవిని ప్రసన్నం చేసుకోడానికి వెళుతున్నాడు. ఆమెను అర్చించి నల్ల మేకపోతును బలి ఇచ్చి ఆ పని పూర్తి చేస్తే ఆమె కరుణిస్తుంది. ఇక ఆ పైన అతనిని జయించగలవాడు ఉండడు. అందుచేత లక్ష్మణుని పంపి  అతనిని మట్టుపెట్టాలని చెబుతాడు” ఇదీ అసలు రహస్యం. ఇదే ఇంటిగుట్టు, అవసరం వచ్చినప్పుడు చెప్పి రాముని జయానికి దోవచేసినవాడు విభీషణుడు. అందుకే ”ఇంటి గుట్టు లంక చేటని” సామెత.



శర్మ కాలక్షేపం కబుర్లు-నీళ్ళావకాయ


నీళ్ళావకాయ

ఎండలు పెరిగాయి. అప్పుడే 40/24 వేడి ఉంటోంది వారం నుంచి. ఓ పక్క కరోనా భయం మరో పక్క ఎండభయం, కదిలేందుకులేదు,మెదిలేందుకులేదు. ఇలాటి సందర్భంలో ఫ్రిజ్ లో ఉన్న కూరలన్నీ నిండుకున్నాయి. ఏంచేయాలనేలోగా ఒక రోజు దూరం పాటిస్తూ కూరలు అమ్మకానికి పెట్టేరంటే అబ్బాయి వెళ్ళి కూరలు తెచ్చాడు. అందులో మూడు మామిడి కాయలున్నాయి. ఈ సంవత్సరం చెట్టున ఆకులేగాని పిందెలేదు, అదేమోగాని పక్కదొడ్డిలో ఉన్న మూడు వేపచెట్లూ పూయలేదు, అలా జరిగింది కొత్త సంవత్సరం. ఈ మూడుమామిడి కాయల్నీ నీళ్ళ ఆవకాయ వెయ్యమన్నా కోడలమ్మాయిని.  వింతగా చూసింది. ఇలా పెడతారని చెప్పి పెట్టించా, అవధరించండి

.ఈ ఆవకాయ మూడు లేదా నాలుగు రోజులకంటే నిలవ ఉండదు, అదీ దీని ప్రత్యేకత.పుల్లగా ఉన్న మామిడి కాయల్ని ముక్కలుగా తరగండి. ఇవి రాలిన కాయలైనా బాధ లేదు గాని ఉడుకు కాయలు మాత్రం కాకూడదు. తరిగిన ముక్కలకి సరిపడా ఉప్పు కారం,ఆవ పోసి కలపండి. నీళ్ళు కళపెళా కాచండి. కాగిన నీరు వేడిగ ఉండగానే ముక్కలతో గుచ్చెత్తిన దానిలో పోయండి, మూత పెట్టి ఉంచేయండి, నాలుగు గంటలు. ఇప్పుడు వాడండి బలే ఉంటుంది, ఆవకాయలానే

శుభమస్తు

శర్మ కాలక్షేపంకబుర్లు-కష్టాలే కలిసొస్తాయి.

సుఖాలు కలిసిరావు కష్టాలే కలిసొస్తాయి.

ఇది నిజమైన మాట. మనం సాధారణంగా అనేసుకుంటాం కాని విమర్శ చేసుకోము. ఒక కష్టం లో ఉండగా మరో కష్టం మీద పడటం గా అనుకుంటాం. అసలు కష్టాలేంటీ అనేదే ప్రశ్న. అష్ట కష్టాలు అనేవారు. ఇప్పుడూ అంటున్నట్టే వున్నారు. ఇవి కాలాన్ని బట్టి మారుతున్నట్టే వుంది.ఒకప్పుడు కష్టమైనది మరొకప్పుడు కాదు. కొన్ని మాత్రం అప్పటికి ఇప్పటికి మార్పురాలేదు. (  అల్లుడు ఇంటికి రావడం )

ఇప్పుడు చేరిన కష్టాలలో ఇంటర్ నెట్ పోవడం కూడా ఒక కష్టంగా చేరిపోయిందనుకుంటాను. మాకెప్పుడూ ఇంటర్ నెట్ పోదు, అనుకోవద్దు, వైద్యుని భార్య కూడా ముండా మోస్తుందని సామెత. అసలే లాక్ డవున్ లో ఉండి ఒక చిన్న ప్లగ్గు తెగిపోవడం మూలంగా ఇంటర్ నెట్ పని చెయ్యకపోతే, కొత్తది తెచ్చుకోడానికి లేకపోయే, మరోటి లేదు, నిజంగా పిచ్చే ఎక్కుతుంది, ఈ సమయంలో. అందరికి పోతే అదో సంతృప్తి.మనకే బయటపోతే బాగుచేసుకోడం మనవల్ల కాకపోతే, అబ్బో ఇంతకు మించిన కష్టం మరోటి లేదు. అదే ఒక రోజైతే, అబ్బో తలుచుకుంటేనే భయంకరం కదా! అలాగనక ఇంటర్ నెట్ పోతే ప్రపంచంలో ఎన్ని పిచ్చాసుపత్రులు కొత్తగా నెలకొల్పాలో! తలుచుకుంటేనే భయం.ఇలాలాక్ డవున్ లో ఉన్న మనకి నెట్ పోతే కష్టం మీద కష్టం వచ్చి పడ్డట్టే. అదే గనక సుఖం మీద సుఖం వచ్చి పడితే అది పులగం మీద పప్పులాటిది. కాని అదెప్పుడూ జరగదు. జరిగినా తెలుసుకో లేం.

నిజానికి కలిసొస్తాయి అనే మాటలోనే అసలు విరుపుంది. మనం    ఒక్కటే
 అర్ధం తీసుకుంటాo. కలసిరావడం అంటే కూడా రావడంగా అనుకుంటాం కాని మరో అర్ధం కూడా చెప్పుకోవచ్చు. అది అనుభవం రావడం లేదా అధికమైన లాభం చేకూరడం కాని కావచ్చు. చెప్పుకోవలసింది రెండవ అర్ధమే కాని మనం అది ఎప్పుడూ చెప్పుకోం. కష్టం వస్తేనే అనుభవం వస్తుంది కదా!

దేవుడా! ఎప్పుడూ నాకు కష్టాలే ఉండేలా ప్రసాదించమన్నాట్ట ఒక భక్తుడు, అదేమయ్యా ఎవరేనా సుఖాలు కావలనుకుంటారుగా అంటే, ఆ భక్తుడు స్వామీ నువ్వు గనక సుఖాలు ప్రసాదిస్తే నిన్నే మరచిపోతా అంచేత ఎప్పుడూ కష్టాలే కావాలి,నిన్ను మరిచిపోకుండా ఉండడానికి అన్నాట్ట.

మరీ అంతొద్దుగాని కష్ట సుఖాలు కలసైరావాలంతే.అసలు కష్టంలోనే కదా ఎవరెవరో తెలిసేది,అసలు స్నేహితులెవరో,బంధువులెవరో తెలిసేది.

సర్వే జనాః సుఖినో భవంతు.

శర్మ కాలక్షేపంకబుర్లు-కుదుపు.

కుదుపు.

కరోనా వైరస్ మానవ జీవితాలని ఒక కుదుపు కుదిపింది.ఏ జీవికైనా ఆహారము,నిద్ర,మైధునము సర్వ సహజ జీవ లక్షణాలు. మానవుడు నాగరికత నేర్చి ఇల్లుకట్టుకోవడం నుంచి అనేకం నేర్చాడు, కాని నేడు నాగరికత పేరున వెర్రిన పడుతున్న వారిని కరోనా ఒక్క కుదుపు కుదిపి మానవులబలహీనతెంతో చెప్పకనే చెప్పింది. సంపాదించుకుంటున్న భూములు,బంగారాలు, వజ్రాలు కట్టుకున్న ఇళ్ళు ఏవీ  కూడా రావని వీటి విలువ గుడ్డిగవ్వ విలువ చేయదని వాటి వెనకపడిపోవద్దనే ఒక హెచ్చరిక ఇచ్చింది.స్వంతలాభం కొంతమానుకు పొరుగువానికి సాయపడవోయ్ దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్నది నిజం చేదాం. గుర్తుకు తెచ్చుకుందాం.కలసికట్టుగా నిలుద్దాం,బ్రతుకుదాం. స్వంతలాభం కొంతమానుకు పొరుగువానికి సాయపడవోయ్ దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్నది నిజం చేదాం. గుర్తుకు తెచ్చుకుందాం.కలసికట్టుగా నిలుద్దాం,బ్రతుకుదాం.  

మానవ చరిత్రలో, మానవుడు ఇలా ఇంటిలో దాక్కుని కూచుని వుండే సంఘటన ప్రపంచ వ్యాప్తంగా ఇదే మొదటిసారి అనుకుంటాను.లాక్ డవున్ పదునాల్గుతో పూర్తి అవుతోంది.ముందు ఏం జరగనుందీ తెలియదుప్రపంచం మొత్తం మీద ఈ మహమ్మారి బారిన పడి చనిపోయినవారు ఒక లక్షపైన ఉండచ్చు. ఇప్పటికి మహమ్మారిని మానవాళిపై వదలినవారికి ఆత్మ పరిశీన లేనట్టే వుంది. ఈ మహమ్మారి మానవాళినే తుడిచిపెట్టేలా ఉంది. దీని భయంకర రూపం ఇప్పటికి కొంతమందికి నేటికీ తెలియకపోవడమే వింత, ఎంత చెప్పినా .

చనిపోయినవారి కి ఉత్తరగతులు కలిగేలా ప్రార్ధన చేయడమే మిగిలినవారు చేయగలది. ఇంతకు ముందు మానవాళి చరిత్రలో ఇటువంటి సంఘటన జరుగలేదు గనక ఈ ఏప్రియల్ నెలను అంతర్జాతీయ శోకమాసంగా ప్రకటించి, ఇకముందు ప్రతి సంవత్సరమూ ఏప్రియల్ నెలను ప్రపంచ వ్యాప్తంగా లాక్ డవున్ ప్రకటించాలని నా కోరిక.