శర్మ కాలక్షేపంకబుర్లు-కందం కట్టినవాడే……………..

కందం కట్టినవాడే……………..

”కందం కట్టినవాడే కవీ, పందిని పొడిచినవాడే బంటూను” అని ఒక నానుడి. కందంకట్టడమేంటీ? కందం అనేది ఒక అందమైన పద్యం. ఈ పద్యంలో గణాలు యతి ప్రాసలు సరిగా ఉండేలా, సరియైన భావంతో నిర్మిస్తే అది కలకాలం నిలబడిపోతుంది, కాలంతో పాటు. ఏదైనా నశించచ్చుగాని ఇలా నిర్మించిన, అదే కట్టిన పద్యం వందల వేల సంవత్సరాలైనా నిలిచే ఉంటుంది, ప్రజల నాలుకల మీద.

అసలు పద్యం కట్టడమేంటీ? ఇల్లు కట్టాలంటే కొన్ని నియమాలుంటాయి అలాగే పద్యాలు రాయడానికీ కొన్ని నియమాలున్నాయి, అందుకే దీన్ని కట్టడం అన్నారు,రాయడం అనకుండా, కంద పద్యానికైతే మరిన్ని ఇక్కట్లున్నాయేమో తెలీదు.. ఈ సందర్భంగా శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారు మొదటిలో పద్యం కట్టడానికి పడ్డ పాట్లు చెప్పుకొచ్చారు, తమ అనుభవాలూ-జ్ఞాపకలూనూ లో. వారు చాలా విస్తృతంగా చెప్పారు గాని దానిని సంక్షిప్తం చేయక తప్పదు. శాస్త్రిగారు వచనం రాయడంతో ప్రారంభించారు. మొదటగా ‘వారకాంత’ అనే నాటకం రాశారట. తప్పనిసరి పరిస్థితులలో ఒక మిత్ర బృందానికి చేరువయ్యారు. అక్కడ వీరిని పరిచయం చేస్తూ ఒక మిత్రుడు, వీరు ‘కవి’ అని పరిచయంచేస్తే ఏం పద్యాలు రాశారనే ప్రశ్న వస్తే, నాటకం రాశారన్నారట, పద్యం రాయనివారు కవేంటీ, అనే చిన్న చూపురావడంతో వీరికి పద్యం రాయాలనే జ్వరం అంకపొంకాల మీద వచ్చేసింది. ఛందస్సుకోసం అప్పకవీయం కోసం రాసి, మద్రాసు నుంచి తెప్పించుకుని చదవడం మొదలెడితే నాలుగో భాగమే నడవలేదట, యతి గురించిన ఇబ్బంది వస్తే, ఎవరో ఒకాయన చెబుతానంటే, ఆయన వెనకపడ్డారట, ఆయన అదొగో ఇదిగో అని తిప్పేరు తప్పించి, చెప్పిన పాపాన పోలేదన్నారు. ఈ మధ్యలో నాడు అనపర్తి రైల్వే స్టేషను మాస్టరు, పిళ్ళె అనేవారు శాస్త్రిగారి తండ్రిగారి మిత్రులు వారికి దొరికిన ”లక్ష్మీనారాయణీయం” అనే పుస్తకాన్నిచ్చారట. అది పర్యాయపద నిఘంటువు. ఇదిగో అక్కడితో భాషా పరమైన ఇబ్బంది తప్పింది. ఇక యతి గురించిన విషయం ఒక మిత్రులు చెప్పి, ఛందస్సు వీరేశలింగంగారి పుస్తకం ’సంగ్రహ వ్యాకరణం’ ఇవ్వడంతో దాని బెడదా తప్పి పద్యాలు కట్టడం మొదలెట్టేనన్నారు. ఈ సందర్భంగా వారు పద్య నిర్మాణంలో, సాధకావస్థలో ఉన్న వారికొక మార్గం చెప్పేరు క్షేమేంద్రుడు అన్నారు, అది “అర్థమూ,అన్వయమూ చూసుకోవద్దు, మృదువైన శబ్దాలు సుళువుగా గణబద్ధం చెయ్యడం సాధనచేసుకో” అన్నదే ఆ దారి. ఆ తరవాత రెండవ సూత్రంలో పదాలు గణబద్ధం చేయడంలో అర్థమూ,అన్వయమూ చూసుకుంటూ వెళ్ళమని. అందుచేత సాధకుడు ఈ రెండు సూత్రాలూ వంట బట్టించుకోవాలి. నాకైతే ఛందస్సుగాని, పద్యంగాని కొరికుడు పడలేదు. ఈ సందర్భంగా ఒక మాట నాకు మెయిలిచ్చినవారికో ఛందో గ్రంధం పంపగలును.

ఇక పందినిపొడవడం….ఊరపందిని పట్టుకోడం ఎప్పుడేనా చూశారా! పందిని పట్టుకోవాలనుకునేవారు ఉచ్చు వేసిన తాడు కర్రకి తగిలించుకుని పంది వెనక నుంచి మూతికి ఉచ్చు బిగించడానికి చూస్తారు. ఇలా ఉచ్చు కనపడిందంటే పంది పరిగెడుతుంది. దానికి ఉచ్చు అంటే భయం, ఉచ్చు మూతికి తగిలిస్తారు.. పందిని ఎక్కడ కొట్టినా చావదుగాని మూతిమీద కొడితే చచ్చిపోతుంది. అది దాని బలహీన ప్రాంతం. నిజానికి అదే బలమైన ప్రాంతం కూడా. పందికి రెండు కోరలు వస్తాయి బయటికి, నోటి నుంచి. పంది వాటిని ఆయుధంగా చేసుకుని పోరాడుతుంది, చాలా భీకరంగా. అదేగనక అడవి పంది ఐతే చెప్పేదే లేదు, చాలా భీకరంగా పోరాటం చేస్తుంది. పంది వేట గురించి తెలియాలంటే  K.N.Y పతంజలి రాసిన కథలే చదవాలి, ఈయనకి తెనుగునాట రావలసినంత కీర్తి రాలేదన్నదే నా అభిప్రాయం.

నేటి కాలంలో వేట అంటే మంచె, దానినే మాటు అని కూడా అంటారు, దీనిని ఎత్తైన చెట్టుమీద కట్టుకుని తుపాకీ తో, కింద దగ్గరలోకొచ్చిన జంతువుని కాల్చడం కాదు. నాటి కాలంలో వేటగాడు కూడా జంతువుతో సమానంగా నేల మీదుండి విల్లు అమ్ములతోగాని బల్లెం దీనినే బరిశ అని కూడా అంటారు దానితో జంతువుని వేటాడేవారు. పంది వేట గురించి తెలియాలంటే కిరాతార్జునీయం చదవాల్సిందే, పందిని వేటాడటం మరీ కష్టం, పరిగెట్టుకు పారిపోతుంది, బల్లేనికి దొరకదు. బల్లెం విసిరినా సూటిగా దిగబడదు, దిగబడినా పంది పడిపోయేటంత బలంగానూ ఉండదు. పందికి మరో బలహీనత మెడ తిరగదు. మొత్తం శరీరమే తిరగాలి. అందుకే మనవాళ్ళు పందిలా మెడ తిరగదు అంటుంటారు. అందుకు పంది వెనక కాళ్ళు పట్టుకుంటే గింజుకుంటుంది, విదిలించుకునీ పారిపోతుంది. పందిని వెనక కాళ్ళతో పట్టుకుని ఆపగలగడం కష్టమే. ఉచ్చు వేసి నిలపలేరు. పంది వెనక కాళ్ళు కట్టేస్తే మరి కదలలేదు, కాని ఇది చెప్పినంత సుళువేంకాదు. ఒక్కడుగా పందిని వేటాడటం కష్టం, అందుకే ఒకడూ పందిని వేటాడగలిగేడు, పడగొట్టగలిగేడూ అంటే అతనినే బంటూ అన్నారు, అంటే వీరుడూ అని అర్ధం.

కంద పద్యం కట్టడమూ, పందిని పొడవడమూ బహు కష్టమైన పనులు.

20 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-కందం కట్టినవాడే……………..

  1. ఏమండోయ్ కష్టే ఫలే వారు !

    నెనర్లు పుస్తకం కాపీ అందింది !

    ఆ చిర్రావూరు శ్రీ రామ శర్మ గారికి చిర్రావూరు భాస్కర శర్మ అనబడు మాచన వజ్జల గారికి లింకు ఏమిటి ? కహాని చెప్పండి !

    ఇంతకీ “మీరు అడిగినతీరు దేన్నో గుర్తుచేసి నవ్వొచ్చింది” ->> ఏమి గుర్తుకు వచ్చిందండీ ?

    చీర్స్
    జిలేబి

    • జిలేబిగారు,
      పుస్తకం చేరిందని చెప్పినందుకు ధన్యవాదాలు.
      పుస్తకం ఉపయోగించుకోండి, మంచి పద్యాలు కట్టండి. క్షేమేంద్రుని రెండవ సూచన గమనించండి. పర్యాయ పద నిఘంటువు సంపాదించండి. ఇప్పటి వరకు మీ వ్యవసాయానికి అభినందనలు.

      చిర్రావూరి వారి కుటుంబం చాలా పెద్దది. నిడదవోలు దగ్గర అట్లపాడు స్వగ్రామం అంటారు. మా తాతగారి తాతగారి తరంలో తరాలు విడిపోయారట. శ్రీరామ శర్మ గారు సగోత్రీకులు, రాజమహేంద్రవరం నివాసి, బహు గ్రంధకర్త. తెనుగు సంస్కృత భాషా పండితులు. వారి ఫోటో ఈ లింక్ లో చూడచ్చు.

      https://kastephale.wordpress.com/2013/01/18/
      ప్రముఖ పాత్రికేయులు శ్రీ C.Y. చింతామణి గారు మా వంశీకులే.

      నవ్వొచ్చిన విషయం చెప్పలేను, మన్నించండి.
      ధన్యవాదాలు.

      • కష్టే ఫలే వారు !

        నెనర్లు !

        శ్రీ మతి అండ్ శ్రీ కష్టే ఫలే వారి కి

        మీ వివాహ దినోత్సవ శుభ సందర్భం గా శుభాకాంక్షలు

        చీర్స్
        జిలేబి

      • జిలేబిగారు,
        నమస్కారాలు
        APEPDCL వారు ఈ నెల రెండవ తేది నుంచి మాచే అనుభవింపచేస్తున్న చిత్ర హింసలో ఈ విషయమే గుర్తు రాలేదు, మీరు గుర్తు చేసేరు.

        ధన్యవాదాలు.

  2. బాగుందండి టపా, జిలేబీ గారి కోరిక తీరగా…..
    ఇంతకీ క్షేమేంద్రుడు ఎవరో చెప్పనేలేదు 😦 నేనన్న కాశ్మీర కవి కాదేమో. ఎందుకంటే కాశ్మీర కవి అయితే తెలుగు పద్యాల గురించి ఎందుకు మాట్లాడుంటారు ? (అందునా, ఎస్‌పీ బాల సుబ్రహ్మణ్యం గారు టీవీ మీద ఎప్పుడూ అనే మాట ప్రకారం “తెలుగువారికే స్వంతమయిన పద్యం” (??) )

    • విన్నకోట నరసింహారావుగారు,

      పద్యం మన సొత్తే కాదుగాని, మన ప్రత్యేకతే వేరండి.

      క్షేమేంద్రుడు ఎవరో నాకూ తెలీదు, శాస్త్రిగారి మాట తప్పించి. జిలేబిగారు మొదటి దశ దాటేరు, సాధన చేసి రెండవ దశకి రావాలి మరి 🙂
      ధన్యవాదాలు.

  3. “కొట్టితి నేనని అర్జునుడు, పడగొట్టితి నేనని శివుడు ……… ” (కిరాతార్జునీయం)

    • విన్నకోట నరసింహారావుగారు,
      కొట్టితి నేనని అర్జునుడు, పడగొట్టితి నేనని శివుడు ……… ” (కిరాతార్జునీయం)

      తిరకాసంతా ఆ రెండు మాటల్లోనే కదండీ ఉన్నది. కొట్టినవాడు కాదు పడగొట్టినవాడే బంటు కదా.
      ధన్యవాదాలు.

  4. జిలేబి పద్యం అడవిపందితో సమానం.
    దాన్ని ఆపటం ఎవరితరమూ కాదు.
    బ్లాగ్ వనంలోకి కసిగా జొరబడి బీభత్సం చేస్తుంది.

      • కం. లోపములకు పాపములకు
        టైపాటులు మూలమగుచు ఠారెక్కించన్
        తాపములును కోపములును
        వాపోవుటలును రహించు వాటి కరుణచే!

        అనామకసునామధేయులవారూ, టైపాటే నండీ. ధారాశుధ్ధికి అని సరైన పాఠం. qwerty keyboard పైన తెలుగు type చేయటంలో దొసగులు దొర్లుతుంటాయి కద అప్పుడప్పుడూ. పాఠకులే కొంచెం పెద్దమనసు చేసుకోవాలని మనవి.

      • కష్టే ఫలే వారు

        ఆ చేత్తోనే నాకూ ఓ కాపీ పడెయ్యండి

        నెనర్లు
        జిలేబి

      • జిలేబిగారు,

        🙂 🙂 😉

        మీరు అడిగినతీరు దేన్నో గుర్తుచేసి నవ్వొచ్చింది. అసలీ పుస్తకం మీకు పంపాలనే నా యోచన, కాని ఏ అడ్రస్ కి పంపాలి? అదీ సంశయం. మీరు కామెంట్ చేసిన అడ్రస్ కే పంపుతున్నా. ఉపయోగించుకుని మంచి పద్యాలు రాయాలని నా కోరిక.

    • జిలేబిగారు,
      పి.డి.ఎఫ్ లింక్ ఇవ్వల్ ఏను, కాదు ఇవ్వను. పుస్తకం కావాలనుకున్న వారు మెయిలిస్తేనే పంపుతా!
      ధన్యవాదాలు.

  5. అదన్న మాట !

    జిలేబి ఆ శ్రీ పాద శిష్యురాలన్న మాట !

    క్షేమేంద్రు ల వారి మాట శిరోధార్యం !

    బాగుందండీ మీ కలం కదం తొక్కిన కందం;

    మీ పంది వివరణలను చదువుతా ఉంటె మా డాక్టర్ కేశవ రెడ్డి గారి అతడు అడవిని జయించాడు గుర్తు కొస్తోంది 🙂

    అర్థము వలదన్వయమున్
    వ్యర్థము! సాధ్యము! జిలేబి వ్యవధి గనన్ గూ
    డార్థము వచ్చుననుకొని ప
    దార్థము లను పేర్చెనుగద దారి తెలియగన్ !

    చీర్స్
    జిలేబి

    • జిలేబిగారు,

      క్షేమేంద్రులు చెప్పిన మొదటి దశ దాటేరు. మాటల్ని ఆశువుగానే గణ బద్ధం చేస్తున్నరు కదా! అన్వయమూ, అర్థమూ లేకపోయినా. ఇప్పుడు రెండవ దశకి చేరండి. ఆశువుగా చెప్పెయ్యాలనే ఆతురతను అణుచుకోండి. పడికట్టు పదాలు పడకుండా ఉండాలంటే భాష అవసరం. పర్యాయపద నిఘంటువు సంపాదించండి. నా దగ్గర లేదు. ఉంటే ఇచ్చి ఉండేవాడిని. పర్యాయ పద నిఘంటువుంటే పద్యం నల్లెరు మీద బండే కదా!

      పతంజలి చదివి తీరవలసిన రచయిత. చదివేకా చెప్పండి.

      పుస్తకం చేరిందా! తిలకించితిరా?

      ధన్యవాదాలు.

వ్యాఖ్యానించండి