శర్మ కాలక్షేపంకబుర్లు- కైక రాముని వనవాసం పదునాలుగేళ్ళే ఎందుకడిగింది?

కైక రాముని వనవాసం పద్నాలుగేళ్ళే ఎందుకడిగింది?

ఈ ప్రశ్న ఎక్కడో చదివాను, సమాధానం చదవలేకపోయా! నాకు తోచిన సమాధానం ఇదీ!!!

ఈ ప్రశ్నలోకి వెళ్ళే ముందు ఆస్థులు,అనుభవహక్కులు,వాటి కాల దోషం గురించి కొద్దిగా ముచ్చటిద్దాం.

ప్రామిసరీనోటు కాలం మూడేళ్ళు, ఆ లోగా చెల్లు వేయడంగాని,తిరగరాయడంగాని, కొంత జమకట్టడం గాని జరగాలి. మూడేళ్ళు దాటిన మరునాడు ఆ నోటు చెల్లదు. నోటు చచ్చిపోయిందంటారు, దానినే కాలదోషం పట్టిందనడం, ఇంగ్లీష్ లో చెప్పాలంటే టైమ్ లాప్సు అయింది. ఇలాగే అస్థులగురించి కూడా!అనుభవహక్కులు,వాటి కాలపరిమితి వగైరాలు ఉన్నాయి. ఇవి ఏదో ఒకరోజులో వచ్చినవికావు. వేల సంవత్సరాలుగా కాలంతో పాటు మార్పులు చెందుతూ వచ్చినవి, నేటి కాలానికి నోటు మూడేళ్ళకి కాలదోషం, ఏదేని ఆస్థిపై హక్కు నిరూపించుకునే పన్ను కట్టడం, అద్దెతీసుకోవడం, ఇటువంటివి పన్నెండు సంవత్సరాలు కనక యజమాని చేయక ఆస్థిని వదిలేస్తే, ఆ అస్థి అనుభవిస్తున్నవారి సొత్తవుతుంది. ఇప్పటికిన్నీ స్వాధీన తణఖా సమయం పన్నెండేళ్ళని నా ఎరుక. అదేగనక ప్రభుత్వ ఆస్థిని ఇరవై సంవత్సరాలు నిరాటంగా ఆక్రమించుకుని ఉంటే అది అనుభవదారుని స్వంతం ఔతుంది. ఇలా చాలా ఉన్నాయి, నేటి కాలానికి. ఇక ఇప్పుడు ప్రశ్నలోకి వెళదాం.

కైక రెండు వరాలు దశరథుని అడిగింది. అందులో ఒకటి రాముడు పదునాలుగేళ్ళు వనవాసం చెయ్యాలి. పదునాలుగేళ్ళే ఎందుకడిగింది? ఎక్కువో తక్కువో అడగచ్చుకదా?

రామాయణం ఎప్పుడు జరిందంటే నిర్దిష్టమైన సమయం చెప్పడం కష్టం. ఆనాటికి నిలిచి ఉన్న ఆస్థి పై హక్కు కోల్పోడానికి సమయం పదునాలుగేళ్ళు. ఇది దృష్టిలో ఉంచుకునే రాముని వనవాసకాలం పదునాలుగేళ్ళుగా కైక అడిగింది. అంటే పద్నాలుగేళ్ళు వనవాసం తరవాత రాముడు మరల రాజ్యాన్ని స్వాధీనం చేసుకోలేడు, కాల దోషం పట్టింది కనక.

దశరథుడు మరణించాడు, రాముడు వనవాసంకి వెళ్ళిన తదుపరి. భరతునికి కబురంపేరు, మేనమామ ఇంట ఉంటే. వచ్చి విషయం తెలుసుకున్న భరతుడు అన్నదగ్గరకు పోయి రాజ్యం నీదే ఏలుకోమని కోరాడు. రాముడు ఒప్పుకోలేదు,పదునాలుగేళ్ళ తరవాత తిరిగివస్తానన్నాడు, ఎంత చెప్పినా. చివరికి రాముని పాదుకలు పుచ్చుకుని వచ్చి, వాటికి పట్టాభిషేకం జరిపించాడు, భరతుడు.

పదునాలుగేళ్ళ వనవాసం తరవాత వస్తాను, రాజ్యం ఏలుకుంటానని చెప్పినా. భరతుడు ఇలా ఎందుకు చేశాడు?

రాముని దగ్గరకు తిరిగి రమ్మని చెప్పడానికి కొంతమందే వెళ్ళేరు, ఇక్కడ ఏమి జరిగినదీ ప్రజలకి తెలియదు. పాదుకలు తెచ్చి వాటికి పట్టం కట్టకపోతే, పదునాలుగేళ్ళ తరవాత రాముడు కనక రాజ్యం తీసుకుంటే, రాముడు భరతుని రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడని ప్రజలనుకోవచ్చు. అందుకే పాదుకా పట్టాభిషేకం, ప్రజలకి రాజ్యం రామునిదే అని చెప్పడానికి భరతుడు చేసినది. అలా అనుకోకుండడానికే భరతుడు పాదుకలు తెచ్చి పట్టం కట్టడమే కాక అయోధ్యలో కాక నంది గ్రామంలో ఉండి రాజ్య పాలన చేశాడు. భరతుడు రామునితో నీవు గనక పదునాలుగేళ్ళు దాటిన మరునాటికి అయోధ్యకి రాకపోతే నేను సన్యసిస్తానని చెబుతాడు. అందుకే రాముడు సమయానికి రాలేక హనుమతో వస్తున్న కబురు ముందుగాపంపినది.

మరొక సంగతి కూడా చర్చకు రావచ్చు అది భారతంలో పన్నెండేళ్ళ వనవాసం, ఒక సంవత్సరం అజ్ఞాతవాసం. ఇది పందెం.ఎలాగైనా ఉండచ్చు. కాని ఇందులో కూడా పదమూడేళ్ళు అన్నది ఆ కాలంనాటి కాలదోష సమయం అనుకుంటున్నా.ఇవి వేల సంవత్సరాలలో ఆస్థి, అనుభవ హక్కుల్లో వచ్చిన తేడాలు.రామయణ కాలానికి కాలదోష సమయం పదునాలుగేళ్ళు, భారత కాలం నాటికి అది పదమూడేళ్ళయింది. నేటికి కాలదోష సమయం పన్నెండేళ్ళని చెప్పుకున్నాంగా. కాలదోష సమయం ఇలా తగ్గుతూ వచ్చింది.

6 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు- కైక రాముని వనవాసం పదునాలుగేళ్ళే ఎందుకడిగింది?

  1. చూపడు (ట).

    ఆన్-లైన్ వెతుకులాటలో దొరికిన సమాచారం 👇
    ———————-
    “Inclusions in Encumbrance Certificates
    The details given in the Encumbrance Certificate will only be for the time period for which it was applied for in the first place, and any past transaction details will not be provided. “
    ———————-

    మీకు తెలియనిదేముంది. ఏయే సంవత్సరాలకు (ఉదా : 2009 to 2022 అంటే 13 యేళ్ళు) EC కావాలని అడిగామో సదరు సంవత్సరాలలో రిజిస్టర్ చెయ్యబడిన లావాదేవీలు మాత్రమే EC లో చూపిస్తారట. ఆ సంవత్సరాల కన్నా పాతవి (ఉదా: 1972 లో అంటే 50 యేళ్ళ క్రితం చేసిన 99-యేళ్ల లీజ్) ఇంకా చెల్లుబడిలో ఉన్నప్పటికీ ఇప్పటి 13 యేళ్ళ EC లో గానీ, 30 యేళ్ళ EC లో గానీ చూపించరట.

    కానీ అన్యాయం కదా 😧 ? ఏ లాజిక్ తో తెల్లోడు చట్టం తయారు చేశాడో మరి?

    కృష్టాష్టమి శుభాకాంక్షలు.

    • విన్నకోటవారు,
      చాలా దశాబ్దాల తరవాత వచ్చిన అనుమానం. 🙂 Thanks.
      తెల్లోడు తెల్లోడు అనుకుంటూనే గడిపేశాం కాలం ఇన్నేళ్ళూ, ఎన్నేళ్ళూ? 75 🙂 ఉన్న చట్టాలలో మనకి నేటికి కాని వాటిని రద్దు చేసుకోలేకపొయాంగా! చచ్చిచెడి మొన్ననామధ్య ఏవో కొన్నిటిని రద్దు చేశారు, ఇంకెన్ని ఉన్నాయో !!!!

  2. ఒక యుగం నుంచి తరువాత యుగానికి మారేసరికి జనాల ఆయుఃప్రమాణాలు కూడా తగ్గుతూ వస్తున్నాయి కదా శర్మ గారూ 😁.

    అసలు విషయానికొస్తే ప్రస్తుత కాలదోష పరిమితి పన్నెండేళ్ళు కాబట్టే తనఖా రుణాల అర్జీతో పాటు కనీసం గత 13 సంవత్సరాల ఎన్-కంబ్రెన్స్ సర్టిఫికేట్ (Encumberance Certificate – ఈ.సీ. అని వాడుక పదం) సబ్-రిజిస్ట్రార్ ఆఫీసు నుంచి తీసుకు రమ్మని బ్యాంకుల నిబంధన అని మీకు తెలిసిన విషయమే. ఆస్తి రుణరహితం గానే ఉందో లేక మరేదైనా తనఖాలో ఉందో చూపిస్తుంది ఈ.సీ.

    • విన్నకోటవారు!

      అవును కదా!
      నేటికున్న చట్టాలు పాతకాలంలో సంఘంలో ఉన్న ఆచారాలనికూడా ప్రతిబింబిస్తుంటాయి. చట్టం చేసేటపుడు చాలా విషయాలు పరిగణనలోకి తీసుకుంటారు, చట్టం చేయడం అంత తేలికైన సంగతికాదు కదా!
      ఇ.సి పదమూడేళ్ళకే ఎందుకు తీసుకుంటారో చాలామందికి తెలియదు. అసలు ఇ.సి అంటే కూడా తెలియదేమో!పదమూడేళ్ళ ఇ.సిలో తొంబైతొమ్మిది సంవత్సరాల లీజులాటివి ఉండవనుకుంటానండి. విషయం తెలియదు.కాలం మారిపోతోంది కదండీ 🙂

      • శర్మ గారు,
        మీకు చెప్పేపాటివాడిని కాను 🙏.

        నాకు తెలిసి ఒక సంవత్సర కాలం కన్నా ఎక్కువకు వ్రాసుకున్న లీజ్ అగ్రిమెంట్ ను చట్టరీత్యా కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చెయ్యాలి.

        రిజిస్ట్రేషన్ చేసిన లావాదేవీలన్నీ ఈ.సీ లో చూపించాలి సబ్-రిజిస్ట్రార్ మహాశయులు. ఈ.సీ. 13 యేళ్ళకా ఇంకా ఎక్కువకా అన్నది ముఖ్యం కాదేమో? ఈ.సీ. కావాలని అడిగిన వ్యక్తి ఎన్ని సంవత్సరాల కోసం ఈ.సీ. అడిగాడో సదరు సంవత్సరాలలో ఏదైనా 99-యేళ్ళ లీజ్ అగ్రిమెంట్ గనక ఆ ఆస్తి మీద రిజిస్టర్ అయ్యుంటే ఆ లీజ్ కూడా ఈ.సీ. లో చూపించాలి.

        ఇది నా అవగాహన 🙏.

      • విన్నకోట వారు,
        నా అనుమానం సరిగా చెప్పలేకపోయి ఉన్నానేమో! ఇ.సి లు దస్తావేజులు, లిటిగేషను courts, lawyers,clerks etc. అంతాపద్నాలుగు నుంచి పద్దెనిమిది వయసులో ఆపోశనపట్టేశాను 🙂 కవులు,కదపా, హక్కువిడుదల, మనోవృతి, సెటిల్మెంట్, దానపత్రం, విల్లు ఇలా రకరకాలదస్తావేజులు వంద సంవత్సరాల కాలంవి ఉండేవి, ఒక కావిడి పెట్టి నిండా. వాటిలో నాటికి నాకవసరమైనవాటిని, పూసకుట్టురాత,గొలుసుకట్టురాత, ఇలా పలు రకాల రాతలని చదివి వాటిని అర్ధం చేసుకున్నాను ఆ వయసులోనే! అది అవసరం 🙂 చాలా చరిత్రని నా చేతులతోనే నాశనం చేశా! తెలియక, ఆ వయసులో!
        అనుమానం:- తొంభైతొమ్మిది సంవత్సరాల లీజు పదమూడేళ్ళలో రిగిస్టర్ ఐ ఉంటే ఇ.సి లో చూపిస్తాడు. ఆ లీజు పాతికేళ్ళ కితంది ఐతే ఈ పదమూడేళ్ళ ఇ.సి లో చూపుతాడా చూపడా?

వ్యాఖ్యానించండి